YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఏప్రిల్ 9న క్లారిటీ ఇస్తారా

 ఏప్రిల్ 9న క్లారిటీ ఇస్తారా

ఖమ్మం, మార్చి 27, 
వైఎస్  షర్మిల శిబిరం నుంచి పాలేరు మాట వినిపించగానే ఖమ్మం రాజకీయ వర్గాలు అలర్ట్‌ అయ్యాయి. ఇంతకీ ఆమె పాలేరును ఎంచుకుంటారా? ఈ నియోజకవర్గంపై నమ్మకమా? అభిమానుల ఒత్తిడా? షర్మిల అండ్‌ కో పాలేరుపై వేసుకుంటున్న లెక్కలేంటి? తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి ఖమ్మం వేదిక కానుంది. ఏప్రిల్‌ 9న లక్షమంది సమక్షంలో పార్టీ పేరును, జెండాను, అజెండాను ప్రకటించాలన్నది ప్లాన్‌. పార్టీ ప్రయాణానికే కాకుండా తెలంగాణలో రాజకీయంగా వేళ్లూనుకోవడానికి కూడా ఖమ్మంను బేస్‌ చేసుకోబోతున్నట్టు ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది. ఇందుకు గతంలో ఈ  జిల్లాలో వచ్చిన ఫలితాలను గీటురాయిగా భావిస్తున్నట్టు సమాచారం. ఏపీకి సరిహద్దు ప్రాంతంగా ఉండటం, జిల్లాలోని గిరిజనుల్లో వైఎస్‌ పట్ల ఉన్న అభిమానం కలిసి వస్తుందని భావిస్తున్నారట. 2014 ఎన్నికల్లో వైసీపీ ఖమ్మం ఎంపీ సీటుతోపాటు మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.  మరో రెండు స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పటికీ అక్కడ వైసీపీతోపాటు వైఎస్‌ అభిమానులు ఉన్నారని షర్మిల శిబిరం బలంగా నమ్ముతోంది. ఇదే సమయంలో పాలేరును షర్మిల ఎంచుకోవాలన్న డిమాండ్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది. పాలేరులో కాంగ్రెస్‌కు బలమైన కేడర్‌ ఉంది. చంద్రశేఖర్‌, దివంగత రామిరెడ్డి వెంకటరెడ్డితోపాటు, ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉన్న కందాల ఉపేందర్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌ నుంచి గెలిచినవాళ్లే. వీళ్లంతా కాంగ్రెస్ నేతలుగా, వైఎస్ శిష్యులుగా ఉన్నారు.  అందుకే   పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిలపై అభిమానులు ఒత్తిడి తెస్తున్నారట. వైఎస్‌ఆర్‌కు పులివెందుల ఎలానో..  మీకు పాలేరు అలాగే అని రెడ్డి, లంబాడా సామాజికవర్గాలకు చెందిన వారు షర్మిలకు చెబుతున్నారట. దానికి ఆమె అవును అనలేదు.. కాదు అని అనలేదు. కానీ.. ఆమె మౌనం అంగీకారమని అభిమానులు ప్రచారం మొదలు పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తారనే చర్చకు శ్రీకారం చుట్టేశారు. ఒకవేళ షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తే బలాబలాలు ఎలా ఉంటాయి అనే లెక్కలు మొదలయ్యాయి. పాలేరులో కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. కానీ అక్కడ రాజకీయం చేసేది మాత్రం రెడ్డి సామాజికవర్గం వారే. గిరిజన సామాజివకర్గం ఆశీస్సులు తప్పకుండా ఉంటాయాని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తే.. ఆమెపై వైఎస్‌ అభిమానిగా ముద్రపడ్డ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తారా? కందాల వర్గం ఎటు మొగ్గు చూపుతుంది?  కాంగ్రెస్‌ను వీడి కారెక్కినా కందాల వర్గం ఆయనతోనే ఉందట. అలాంటప్పుడు కందాలను కాదని షర్మిలకు జైకొట్టే వీలుందా అని కొందరు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం షర్మిల అండ్‌ కో ఫోకస్‌ అంతా ఏప్రిల్‌ 9న నిర్వహించే ఖమ్మం సభపైనే ఉంది. ఆ రోజు పార్టీ ప్రకటనతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేసేది షర్మిల వెల్లడిస్తారో లేదో తెలియాలి. అలాగే ఆమె నోటి నుంచి పాలేరు ప్రస్తావన వస్తే సమీకరణాలు ఎలా మారతాయో కూడా చూడాలి.

Related Posts