YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

భారత తొలి మహిళా క్రికెట్‌ వ్యాఖ్యాత చంద్ర నాయుడు కన్నుమూత

భారత తొలి మహిళా క్రికెట్‌ వ్యాఖ్యాత చంద్ర నాయుడు కన్నుమూత

భారతదేశ తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాతగా పరిగణించబడుతున్న చంద్ర నాయుడు ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న చంద్ర నాయుడు ఇండోర్‌లో తన నివాసంలో మరణించారు. ఆమె వయసు 88 ఏండ్లు. మాజీ క్రికెటర్ సీకే నాయుడు కుమార్తె.

గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఉండి చికిత్స తీసుకుంటున్న చంద్ర నాయుడు ఇవాళ మధ్యాహ్నం కన్నుమూసినట్లు ఆమె సోదరి కుమారుడు విజయ్‌ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.

వయసు సంబంధ అరోగ్య సమస్యలతో చంద్ర నాయుడు బాధపడుతున్నారు. ఆమె ఇండోర్‌లోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అలాగే హోల్కర్ కాలేజీలో చదువుతున్నప్పుడు 50 వ దశకంలో క్రికెట్ ఆడారు. ఆమె ఆటపై చురుకైన ఆసక్తిని కనబర్చారు. అంతర్జాతీయ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా పనిచేసి భారతదేశ తొలి మహిళ వ్యాఖ్యాతగా రికార్డులకెక్కారు.

80 వ దశకంలో తన తల్లి జ్ఞాపకార్థం ట్రోఫీని విరాళంగా ఇవ్వడం ద్వారా మహిళల ఇంటర్-యూనివర్శిటీ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రవేశపెట్టారు. ఆమె ఎంపీసీఏలో చురుకైన సభ్యురాలుగా ఉండి అనేక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఇండోర్, జెయింట్స్ ఇంటర్నేషనల్ క్రియాశీల సభ్యురాలుగా అనేక సామాజిక కార్యకలాపాల్లో పాల్గొన్నారు.

లార్డ్స్ మ్యూజియానికి తన తండ్రి సీకే నాయుడు వినియోగించిన క్రికెట్ బ్యాట్ అందజేత సమయంలో లార్డ్స్ కామన్ రూమ్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి పొందిన ఏకైక మహిళగా చంద్ర నాయుడు నిలిచారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు చంద్ర నాయుడు చురుకుగా ఉండి.. బీసీసీఐ, సీసీఐ, ఎంపీసీఏ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు.

చంద్ర నాయుడు మృతిపట్ల మాజీ క్రికెటర్‌, ఎంపీసీఏ అధ్యక్షుడు సంజయ్‌ జగ్దలే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మహిళా క్రికెటర్లను ఎంతగానో ప్రోత్సహించారని ఆయన కొనియాడారు.

Related Posts