హైదరాబాద్, ఏప్రిల్ 23,
రతదేశంలో పలు నగరాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తూ ఉండడం.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో హైదరాబాద్ ను వీడి సొంత ఊళ్లకు వెళ్లిపోవాలని పలువురు భావిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరం కూడా దాదాపుగా ఖాళీ అవుతోంది. హైదరాబాద్లోని వలస జీవులు లాక్డౌన్ తప్పదంటూ వార్తలు షికారు చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ను వదిలి స్వగ్రామాలకు పయనమవుతున్నారు. అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను ఉపయోగించుకుని సొంతూళ్లకు వెళ్ళిపోతూ ఉన్నారు. స్వగ్రామాలకు జనం తరలుతుండడంతో నగరంలోని రోడ్లు చాలా వరకు బోసిపోయి కనిపిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి వలస కార్మికులు దాదాపు 18 లక్షల మంది వరకు ఉండగా, వీరిలో దాదాపు 60 శాతం మంది వారం క్రితమే నగరాన్ని విడిచిపెట్టారు. మిగిలిన వారు కూడా వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నారు.పెద్ద ఎత్తున తరలిపోతున్న వారితో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి బయలుదేరే రైళ్లు నిండిపోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన, విశాఖపట్టణం వెళ్లే గోదావరి, కాకినాడ వెళ్లే గౌతమి ఎక్స్ప్రెస్ రైళ్లు గత వారం రోజులుగా ప్రయాణికులతో కిక్కిరిసి వెళుతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రోజుకు సగటున 2.60 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.వలస కూలీలు గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే..! ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ.. గాథ.. వందల కిలోమీటర్లు కాలి నడకన వెళ్లిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. నగరాల్లో లాక్ డౌన్ సమయాల్లో ఉపాధి దొరక్క.. ఇక్కడ ఉండడం కంటే సొంత ఊళ్ళకే వెళ్లిపోవడం మంచిది అనుకుంటూ.. ఎలాగైనా సరే సొంత ఊళ్లకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న వాళ్లు ఎంతో మంది..! గత ఏడాది చోటు చేసుకున్న ఘటనలే ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో నగరాల్లో ఇలాంటి వ్యథలే కనిపిస్తూ ఉన్నాయి.