న్యూఢిల్లీ ఏప్రిల్ 23 ఆక్సిజన్ కొరత లేకుండా కేంద్రం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి ఢిల్లీలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు లేవు.. తమకు ఆక్సిజన్ ఇవ్వరా? సీఎంల సమావేశం లో ప్రదానిని ప్రశ్నించిన డెల్లి సిఎం కేజ్రీవాల్ సీఎంల సమావేశాన్ని కేజ్రీవాల్ లైవ్ టెలికాస్ట్ చేయదం పై ప్రదాని ఆగ్రహం.
ఆక్సిజన్ కొరత లేకుండా చూడటం కోసం కేంద్రం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. లేదంలో మహా విషాదం తప్పదని హెచ్చరించారు. శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా మహమ్మారి విస్తృతిపై నిర్వహించిన సమావేశంలో కేజ్రివాల్ తన అభిప్రాయం వెల్లడించారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత గురించి కేజ్రివాల్ వివరించారు. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, ఢిల్లీలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు లేవని, అందువల్ల తమకు ఆక్సిజన్ ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా లేకపోవడంవల్ల రోగి కొన ఊపిరితో ఉన్నపుడు, ఆ పరిస్థితి గురించి తాను ఎవరితో మాట్లాడాలో చెప్పాలని ప్రధానిని కేజ్రావాల్ అడిగారు. ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా జరగకుండా ఇతర రాష్ట్రాలు నిరోధిస్తున్నాయని ఆరోపించారు. ఆక్సిజన్ రవాణా వాహనాలను కొన్ని రాష్ట్రాలు నిలిపేస్తున్నాయని, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడాలని మోదీని కోరారు. తాను ముఖ్యమంత్రినైనప్పటికీ ఢిల్లీలో కరోనా బాధితులకు ఏమీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా నిద్రపట్టడం లేదన్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా తనను క్షమించాలని కోరారు. ఆక్సిజన్ ప్లాంట్లను సైన్యం స్వాధీనం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపేటప్పుడు సైనికులను ఎస్కార్టుగా పెట్టాలన్నారు. అదేవిధంగా వ్యాక్సిన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ధరకు అందజేయాలని కోరారు.ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంతో సీఎంల సమావేశం సందర్భంగా దానిని కేజ్రీవాల్ లైవ్ టెలికాస్ట్ చేయడమే దీనికి కారణం. కరోనాను ఎదుర్కోవడానికి ఓ నేషనల్ ప్లాన్ ఉండాల్సిన అవసరం ఉన్నదంటూ మాట్లాడుతున్న కేజ్రీవాల్ను మధ్యలో ఆపిన మోదీ.. ఇది పద్ధతి కాదు. పీఎంతో జరుగుతున్న ఇన్హౌస్ మీటింగ్ను లైవ్ టెలికాస్ట్ చేయడం ప్రొటోకాల్ను ఉల్లంఘించడమే అవుతుందని మోదీ అన్నారు. అయినా కూడా కేజ్రీవాల్ మాత్రం మోదీ చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా తాను చెప్పాల్సింది చెబుతూ వెళ్లారు. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించాలని అన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నీతీ ఆయోగ్ హెల్త్ మెంబర్ వీకే పాల్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, హర్షవర్ధన్, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరే, అశోక్ గెహ్లాట్, బీఎస్ యెడియూరప్ప, పినరయి విజయన్, శివరాజ్ సింగ్ చౌహాన్, విజయ్ రూపానీ, భూపేష్ బఘేల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి సమావేశానికి హాజరుకాలేదు. బెంగాల్ తరపున ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ పాల్గొన్నారు. కొవిడ్-19 కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కొవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి.