గుంటూరు
కరోనా మహమ్మారితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమయిపోయి వేలాది మంది ప్రాణాలు కోల్పోతావుంటే, రోమ్ నగరం తగులబడుతుంటే ఫిడేల్ వాయిస్తున్న రోమ్ చక్రవర్తి లాగా ఉంది జగన్ ప్రభుత్వ పరిపాలన వుందని గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైయస్సార్ పార్టీ, నేడు ప్రజలను రక్షించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసి చోద్యం చూస్తావుందని అయన అన్నారు.
ఈరోజు కరోనా "సెకండ్ వేవ్" తో రాష్ట్రంలో అల్లకల్లోలమైన పరిస్థితులు మనకు కనిపిస్తావున్నాయి. కరోనా "ఫస్ట్ వేవ్" ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విఫలమైన ప్రభుత్వం, సెకండ్ వేవ్ నష్టాన్ని అంచనా వేయడంలో కూడా ఘోరంగా విఫలమయ్యింది. ఫస్ట్ వేవ్ కి, సెకండ్ వేవ్ కి సంవత్సరం పైగా టైం వున్నా, సెకండ్ వేవ్ వస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితుల్ని ధీటుగా ఎదుర్కోవడానికి కావల్సిన పరిస్థితుల్ని కల్పించలేకపోవడం దురదృష్టకరమని అన్నారు.
ఆక్సిజన్ లేక ప్రజలు చనిపోతావుంటే, ఆక్సిజన్ సప్లై ఎంత కావాలి? రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్ ఎన్ని? దానికి కావలసిన ఆక్సిజన్ సమకూర్చడంలో కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమయ్యింది. రోజుకి 20 వేల మందికి పైగా కరోనా రోగులు, కరోనా బయటపడటంతో ఆసుపత్రుల్లో బెడ్లు లేక, సౌకర్యాలు లేక, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డబ్బులు చెల్లించలేక, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని అయన అన్నారు.
ఈరోజు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయస్సు గల వారికి కూడా టీకాలు వెయ్యమని, ఒకపక్క ప్రజల నుండి డిమాండ్ వున్నా, టీకాలు కొని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరికీ కూడా టీకాలు వేసి కోవిడ్ బారినపడకుండా చూడటంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమయ్యింది. రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రెండు సంవత్సరాల్లో చేసి, ఆ డబ్బును ఏం చేశారో? కూడా తెలియని ఈ ప్రభుత్వం, కేవలం రూ. 1,600 కోట్ల రూపాయలు పెట్టి టీకాలను కొని ప్రజల ప్రాణాలను రక్షించలేని పరిస్థితిలో ఉందంటే, ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత ఒక్క నిమిషం కూడా లేదని అయన అన్నారు.
వేలాది మంది ప్రాణాలు పోతుంటే, దానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ఈరోజు బోనులో నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడలేని మీరు, ఇంకా ప్రజలకు ఏమి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో కేవలం అధికారాన్ని అడ్డంపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవడం, దొంగ ఓట్లు వేసుకొని తిరుపతి ఎన్నికల్లో గెలవడం, తెలుగుదేశం పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం, ఆస్తులు ఆక్రమించుకోవడం, ఆస్తులు ధ్వంసం చేయడం, పరిశ్రమలు మూసివేయడం, ఇవి తప్పితే మీరు సాధించింది ఆంధ్రప్రదేశ్ సంక్షేమం పట్ల, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల సంక్షేమం పట్ల, ఆరోగ్యం పట్ల, ప్రాణాల పట్ల మీకు చిత్తశుద్ధి లేదనే ఈ రోజు ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా మనోవేదన చెందుతున్న విషయం యదార్థమని లయన అన్నారు.