YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

మరాఠా రిజర్వేషన్లు రద్దు సుప్రీం కోర్టు సంచలన తీర్పు

మరాఠా రిజర్వేషన్లు రద్దు సుప్రీం కోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ మే 5
మరాఠా రిజర్వేషన్లపై బుధవారం సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలోని మరాఠా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. ఆర్థిక, సామాజిక వెనుకబాటు తనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయని, 50 శాతానికి రిజర్వేషన్లు మించితే సమానత్వపు హక్కు ఉల్లంఘించినట్టేనని కోర్టు పేర్కొంది. 1992 మండల్‌ తీర్పులో సుప్రీంకోర్టు విధించిన రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని పునః సమీక్షించాల్సిన అవసరం లేదని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, పీజీ మెడికల్‌ కోర్సుల్లో కొత్త రిజర్వేషన్ల చట్టం మేరకు ఇప్పటికే చేపట్టిన ప్రవేశాలు కొనసాగుతాయని తెలిపింది. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది.విద్య, సామాజికపరంగా వెనుకబడిన వర్గంగా మరాఠా సామాజిక వర్గాన్ని గుర్తిస్తూ 2018లో మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాసంస్ధల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిపై బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలవగా.. కోర్టు చట్టాన్ని సమర్థించింది. అయితే, బాంబే హైకోర్టు 16 శాతం రిజర్వేషన్‌ సరైంది కాదని, మరాఠాల కోటా ఉద్యోగాల్లో 12 శాతం మించరాదని, అడ్మిషన్లలో 13 శాతం మించొద్దంటూ 2019లో తీర్పునిచ్చింది. ఈ క్రమంలో రిజర్వేషన్లపై బాంబే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లపై కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరగా.. సమర్థించింది. రాజ్యాంగానికి లోబడే రిజర్వేషన్లు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సామాజికంగా, విద్యా పరంగా వెనకబడినవారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని పేర్కొంది. కేసులో ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మార్చి 26న తీర్పు రిజర్వు చేయగా.. మరాఠా రిజర్వేషన్ల చట్టాన్ని కొట్టివేస్తూ బుధవారం తీర్పును వెలువరించింది.

Related Posts