YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆదివాసీ గ్రామాల్లో నో కరోనా

ఆదివాసీ గ్రామాల్లో నో కరోనా

అదిలాబాద్, మే 12, 
కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచం గజగజలాడుతోంది. కోవిడ్‌ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తోంది. కానీ, ఈ గ్రామప్రజలు మాత్రం గుట్టలు, చెట్ల మధ్య ప్రశాంతమైన జీవనం గడుపుతున్నారు. ఆ ఊరే మండలంలోని లింగాల గ్రామపంచాయతీ పరిధిలోని లవ్వాల. ఇక్కడ ఏడాదిన్నర క్రితం నుంచి ప్రపంచ వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో కల్లోకలం సృష్టిస్తున్న కరోనా.. ఈ ఊరికి మాత్రం చేరలేదు. గ్రామంలో 30 కుటుంబాలకు గాను వందమంది జనాభా ఉంది. గ్రామంలోని ఆదివాసీలు వ్యవసాయ పనులతో పాటు కూలీ పనులకు వెళ్తుంటారు. లవ్వాల గ్రామం తాడ్వాయి మండల కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పచ్చని అటవీ ప్రాంతంలోని చెట్లు, గుట్టల మధ్య ఆదివాసీ కుగ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తున్నారు ఇక్కడి జనం.గ్రామంలోని ఆదివాసీలు అవసరం ఉంటేనే తప్పా ఇతర ప్రాంతాలకు వెళ్లడంలేదు. ప్రతీ వారం గోవిందరావుపేట మండలంలోని పస్రాలో జరిగే సంతకు వెళ్లి వారానికి సరిపడా సరుకులు కొనుగోలు చేసుకొని వస్తారు. వివాహాలు, శుభకార్యాలకు బంధువులు గ్రామానికి వస్తారే తప్పా మిగతా రోజులల్లో దాదాపు అక్కడికి ఎవరూ రారని ఆగ్రామ ఆదివాసీలు చెబుతున్నారు. గ్రామంలోని ఆదివాసీలకు కూడా ఇతర ప్రాంతాల వారితో అంతగా సంబంధాలను కొనసాగించరు. బయటికి వెళ్లే సమయంలో మొఖానికి టవళ్లను అడ్డుపెట్టుకొని జాగ్రత్తలు పాటిస్తామని చెప్పుకొచ్చారు. గ్రామంలోని ఆదివాసీలు ఇతర ప్రాంతాలకు తక్కువగా వెళ్తుంటారు. ముఖ్యంగా పట్టణాలకు అసలు వెళ్లరనే చెప్పాలి. ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లనందున గ్రామంలో ఎవరికీ కరోనా సోకలేదని చెప్పవచ్చు. అధికారుల సూచనల మేరకు ముందు జాగ్రత్తగా కరోనా నిర్ధారణకు ర్యాపిడ్‌ టెస్టులు చేసుకున్నప్పటికీ అందరికీ నెగిటివ్‌గానే తేలింది. గ్రామంలోని వంద మందిలో సుమారు 30 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. పాత కాలం నాటి ఆహార అలవాట్లను నేటికీ కొనసాగించడంతోపాటు పచ్చని చెట్ల మధ్య మా గ్రామం ఉండడంతో ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పవచ్చు. పట్టణాల్లో వలె ఫ్రిజ్‌ వాటర్‌ కాకుండా మట్టికుండలోని నీటిని మాత్రమే తాగుతూ.. కరోనా మహమ్మారికి దూరంగా ఉంటున్నారు. దీంతోపాటు అటవీ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం కూడా వైరస్‌ దరిచేరకుండా ఉండేందుకు ఉపకరిస్తుందని ఆదివాసీలు వివరిస్తున్నారు
వరంగల్ తండాల్లోనూ..
కరోనాతో ప్రపంచమంతా గడగడలాడిపోతుంటే ఏటూరునాగారం మండల పరిధిలోని కోయగూడ ఎల్లాపురం పంచాయతీ పరిధిలోని లంబాడీతండా ప్రజలు మాత్రం ప్రశాంత జీవనం గడుపుతున్నారు. వారి చైతన్యమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. కట్టుబాట్లు, గ్రామ పెద్దలు తీసుకునే నిర్ణయాలను సమష్టిగా ఆచరిస్తూ.. కోవిడ్‌ మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, చేతులు ఎప్పటికప్పుడు శానిటేషన్‌ చేసుకోవాలని గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ గ్రామాల నుంచి బయటకి వెళ్లిన వారు ఇంటికి తిరిగి రాగానే వేడినీళ్లతో స్నానం చేయాలని నిర్ణయించారు. రోజూ వేడి చేసిన నీరు తాగుతూ.. వ్యక్తిగత శుభ్రత పాటించడంతో కరోనా తమ గ్రామానికి రాలేదని గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నారు.తండాలోని ప్రజలు ఎవరూ బయటికి వెళ్లకుండా ఉండడం.. తండాకు ఎవరినీ రానీయకుండా ఆపేయడం వంటి చర్యలతో కరోనా నియంత్రణలో ఉందని గ్రామస్తులు తెలిపారు. ఇక్కడి ప్రజలు మూడు దశాబ్దాలుగా పోడు వ్యవసాయంతో పాటు  వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి, వేరుశనగ పండిస్తున్నారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో నిరంతరం ఇబ్బందులు పడుతుంటారు. అయినా చైతన్యంతో స్థానిక పరిస్థితులపై నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. కరోనా మొదటి వేవ్‌ ప్రారంభంలోనే ప్రజలంతా ఏకమై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు కావడంతో నిత్యావసర వస్తువులను పంటల ఆధారంగా ఒకేసారి నిల్వ చేసుకోవడం జరుగుతుంటుంది. ఒక వైపు జీడివాగు, మరోవైపు అటవీప్రాంతం కావడంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సెకండ్‌ వేవ్‌లో ఒక్క కేసు కూడా లేకపోవడం గమనార్హం.

Related Posts