ఒక రాజ్యంలో రాజుగారు చాలా మంచి వాడు . ఆయన ప్రతి రోజూ పేద బ్రాహ్మణులకు ప్రత్యేక సత్రం కట్టించి మద్యాహ్న భోజనం వండించి పెట్టేవాడు. ఒక రోజు యధావిధిగా భోజనం వండించే ఏర్పాట్లు చేస్తున్నాడు . అదే సమయం లో ఆకాశం లో ఎగురుతున్న ఒక గద్ద కాళ్ళతో పట్టుకున్న పాము నోటినుండి విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం బేసిన్ లో పడింది . అది ఎవరూ గమనించలేదు. ఆభాగం ఒక బ్రాహ్మణుడు తిన్నాడు . అది తినడం వలన అతడు చనిపోయాడు . ఈ వార్త రాజుగారికి చేరింది . ఆయన చాలా దుఃఖించాడు . మేలు చెయ్యబోతే ఇలా కీడు జరిగింది అని ఆయన చింతించాడు .
ఇప్పుడు బ్రాహ్మణుడు చనిపోవడానికి కారణం ఎవరు ?
ఆ రాజా ? వంటవాడా ? పామా ? గద్దా ? వడ్డించిన వ్యక్తా ?
రాజు చేసేది ధర్మ కార్యం అతనిది తప్పులేదు.
గ్రద్దకు పాము ఆహారం దాని తప్పు లేదు.
పాముది మరణ బాధ కొట్టుకుంటోంది, దాని తప్పులేదు
వడ్డించే వాడికి విషయం తెలీదు, అతని పని అతను చేస్తున్నాడు, అతని తప్పూ లేదు.
మరి ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి ?
వీరిలో ఎవరూ కావాలని ఆ బ్రాహ్మణుడిని చంపలేదు .
యమ ధర్మరాజును చిత్ర గుప్తుడు అడిగాడు. యమధర్మరాజుకు ఏమి చెప్పాలో అర్థం కాక అది అలా ఉంచు బాగా ఆలోచించి చెపుతాను అన్నాడు.
ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల తర్వాత దారినే పోతున్న బ్రాహ్మణులు కొందరు రాజుగారు బ్రాహ్మణులకు అన్నదానం చేసే సత్రం ఎక్కడో చెప్పమని ఒక వనితను చిరునామా అడిగారు. ఆమె వారికి దారిని చూపుతూ “బాబూ ! జాగ్రత్త మా రాజు గారికి బ్రాహ్మణులు అంటే పడదు, కొద్ది రోజుల క్రితమే ఒకాయనను విషం పెట్టి చంపేశారు” మీ రోజులు బాగున్నాయో లేదో ? చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అంది వెంటనే యమధర్మరాజు “ చిత్రగుప్తా ! మొత్తం పాపం అంతా ఈమె ఖాతాలో వెయ్యి అన్నాడు. సదుద్దేశ్యంతో ధర్మ కార్యాలను చేసేటప్పుడు యాదృచ్చికంగా జరిగే పనులకు , తప్పు ఎవరిదో తెలీకుండా నిందలను ఆపాదిస్తూ, వ్యక్తులను నిందించే వారికే ఆ మొత్తం కర్మ ఫలం కలుగుతుంది అని ధర్మరాజు అన్నారు. కాబట్టి విషయం సవివరంగా తెలియనప్పుడు ఎవరిమీద మనం నిందారోపణలు చేస్తే ఆపాపం మనకే వస్తుంది.
తస్మాత్ జాగ్రత్త.