కరీంనగర్
గత కొన్ని రోజులుగా తనపై వరుస విమర్శలు గుప్పిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా బిడ్డా.. గంగుల గుర్తుపెట్టుకో అంటూ ఈటల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హుజురాబాద్లో మంగళవారం \మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల ను ఉద్దేశించి ఈటెల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎవడికీ శాశ్వతం కాదు.. బిడ్డా గంగుల గుర్తు పెట్టుకో. కరీంనగర్ సంపద విధ్వంసం చేశావ్. కరీంనగర్ను బొందల గడ్డగా మర్చినావ్. నీ పదవీ పైరవీ వల్ల వచ్చింది. నీ కల్చర్ నాకు తెలుసని మండిపడ్డారు. ఇప్పుడు తనపై తోడేళ్లలా దాడులు చేస్తున్నవారు ఇక్కడ ఎవరి గెలుపులో అయినా సహకరించారా అంటూ ప్రశ్నించారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి సభ్యత, సంస్కారం ఉండాలని హితవు పలికారు. నీ బెదిరింపులకు భయపడను. నా ప్రజలు నిన్ను పాతర పెడతారని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని ఈటల రాజేందర్ అన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానని చెప్పారు. తనపై కక్షతో తనను కొందరు ఇబ్బంది పెట్టారని.. తన మద్దతుదారులు, ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం తనకు పట్టిన గతే రేపు నీకు పట్టవచ్చంటూ నియోజకవర్గ ఇంఛార్జిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. 2023 తర్వాత నువ్వు ఉండవు.. నీ అధికారం కూడా ఉండదంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రజలు అమాయకులు కారు. సంస్కారంతో మర్యాద పాటిస్తున్నా. సహనం కోల్పోతే మాడి మసి అయిపోతారని అన్నారు.