ఖమ్మం
తెలంగాణ రాష్ట్ర సాధన మలి దశ ఉద్యమకారుడు బుడాన్ బేగ్(65) సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. కొవిడ్ బారినపడి కొన్నిరోజులుగా బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో బ్లాక్ఫంగస్ సోకడంతో మరణించారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉండటంతోపాటు, జిల్లా పార్టీ కార్యాలయానికి తన సొంత స్థలాన్ని కేటాయించారు. అక్కడి నుంచే పార్టీ, ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యమంలో భాగంగా కేసీఆర్ను జిల్లా జైల్ కి తరలించే సమయంలో ఖమ్మం నగరంలో నిర్వహించే ఆందోళనలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరుణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా పనిచేశారు 2019 సాధారణ ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఇటీవలే మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో తిరిగి తెరాసలో చేరారు.
పలువురి సంతాపం.. బుడాన్ బేగ్ మృతి పార్టీకి తీరని లోటని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు బేగ్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బెంగుళూరులో చికిత్స సమయంలో అవసరమైన ఇంజక్షన్లను తాను పంపించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సుడా ఛైర్మన్ బచ్చు విజయ్కుమార్, తెరాస నాయకులు గుండాల కృష్ణ, వద్దిరాజు రవిచంద్ర వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు