గుంటూరు, మే 24,
టీడీపీ సీనియర్ నాయకుడు, గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రాజకీయంగా సైలెంట్గా ఉండటం జిల్లా టీడీపీ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. గురజాల నియోజకవర్గంలో వరుస విజయాలు దక్కించుకుని మంచి గుర్తింపు పొందిన నేత.. యరపతినేని శ్రీనివాసరావు చంద్రబాబు, లోకేష్కు అత్యంత ఆప్తుడు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన జిల్లాలో ఓ రేంజ్లో చక్రం తిప్పారు. ఈయన ప్రారంభించిన కళ్యాణ కానుక పథకం ఆలంబనగా.. చంద్రబాబు మహిళలకు పసుపు-కుంకుమ వంటి పథకాలు అమలు చేశారు. 1994, 2009, 2014లో టీడీపీ తరఫున ఇక్కడ విజయం దక్కించుకున్న యరపతినేని శ్రీనివాసరావు గత ఎన్నికల్లో ఓడిపోయారు.గడిచిన రెండేళ్లలో తొలి ఏడాది బాగానే యాక్టివ్గా పనిచేసినా.. ఆరేడు మాసాలుగా ఆయన ఎవరికీ అంతుచిక్కడం లేదు. నియోజకవర్గంలోనూ యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. పైగా పార్టీలోనూ గతంలో ఉన్నంత జోరు చూపించలేక పోతున్నారు. ఈ పరిణామాలతో అసలు యరపతినేని శ్రీనివాసరావు టీడీపీలో ఉండేనా ? వచ్చే ఎన్నికల బరిలో ఉంటారా ? అన్నది కూడా పార్టీలో కాస్త సందేహాంగా వినిపిస్తోన్న మాట. స్థానిక ఎన్నికల్లోనూ ఆయన ఇల్లు విడిచి బయటకు రాలేదు. ఇక, రాజకీయంగా మీడియా ముందుకు కూడా రావడం లేదు. దీనికి ప్రధానంగా తనపై ఉన్న మైనింగ్ కేసులేనని కొందరు అంటున్నారు.ఏడాది క్రితం యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసు ఏకంగా సీబీఐ వరకు వెళ్లింది. తర్వాత ఏం జరిగిందో కాని… ఈ కేసు ఒక్కసారిగా తెరమరుగు అయ్యింది. యరపతినేని సైలెంట్ అయిపోయారు. ఇది ఓ సందేహం అయితే మరికొందరు.. పార్టీలో ఆయనకు నిరాదరణ పెరిగిందని చెబుతున్నారు. జగన్ సర్కారు యరపతినేని శ్రీనివాసరావు పై పెట్టిన కేసులను అరెస్టు వరకు తెచ్చుకోకుండా.. ఆయనే సర్దు బాటు చేసుకున్నారు. కానీ, పార్టీపరంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరడం లేదని.. కనీసం పలకరింపు కూడా లేదని యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు అంటున్నారు. దీనికితోడు తాను ఇప్పుడు దూకుడుగా ఉన్నా.. ప్రయోజనం లేదని.. ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.అసలు ఎంపీటీసీ, జడ్పీటీసీ, పిడుగురాళ్ల మున్సిపల్ ఎన్నికలను ఆయన ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో గురజాల వైసీపీ ఏకగ్రీవాలతో స్వీప్ చేసి పడేసింది. నియోజకవర్గంలో వైసీపీ హవానే ఎక్కువగా ఉందని.. తాను ఒంటరి పోరు చేయడం వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని యరపతినేని శ్రీనివాసరావు తలపోస్తున్నట్టు చెబుతున్నారు. ఈ కారణంగానే యరపతినేని శ్రీనివాసరావు మౌనంగా ఉన్నారని అంటున్నారు. ఇక, పార్టీ మారే విషయానికి వస్తే.. సంస్థాగతంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. ఆయన ఏనాడూ పార్టీ మారిన పరిస్థితి లేదు కనుక.. ఇప్పుడు కూడా టీడీపీలోనే కొనసాగుతారని, కానీ, మరో రెండేళ్లు మాత్రం మౌనంగానే ఉండనున్నారని చెబుతున్నారు.