హైదరాబాద్, జూన్ 2,
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై అనర్హత వేటు వేసే దిశగా టీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఈటెలపై అనర్హత వేటు వేసేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలిసిన విషయం తెలిసిందే. ఈటల బీజేపీ నేతలను కలవడాన్ని సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే ఈటెలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనుంది టీఆర్ఎస్ పార్టీ. అనర్హత వేటు వేసేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా..స్పీకర్ కు ఫిర్యాదు చేయనుంది. ఈటలతో సహా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న పలువురు నేతలపై కూడా టీఆర్ఎస్ అనర్హత వేటు వేయనున్నట్లుగా తెలుస్తోంది.ఈక్రమంలో ఈటల తన అనుచరులతో కలిసి నిన్న ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డాను కలిసారు. పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జేపీతో జరిగిన భేటీలో బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ లోనే కొనసాగుతూ బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న ఈటెలపై పార్టీ నేతలతో సహా సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. ఈటెలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరనుంది. ఈటెల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ ను కోరనుంది.కాగా మాజీ మంత్రి ఈటలపై భూ కబ్జా చేసేశారనే ఆరోపణలో మంత్రి పదవిని నుంచి భర్త్ రఫ్ చేయటం..అనంతరం ఆయన తన అనుచరులతో భవిష్యత్ కార్యచరణ కోసం పలు సార్లు భేటీ కావటం అనంతరం బీజేపీలో చేరాలను నిర్ణయం తీసుకుని ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డాను కలవడం వంటి పలు అంశాలపై టీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. దీంతో క్రమశిక్షణా చర్యలు తీసుకునే భాగంగా స్పీకర్ ను కలిసి అనర్హత వేటు వేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు.
పల్లా కామెంట్స్ తో బలం
ఈటల రాజేందర్ చుట్టూ ఇప్పుడు హాట్ పాలిటిక్స్ నెలకొన్నాయి. మొన్నటి వరకు ఆయన ఏ పార్టీలో అని అంతా ఆసక్తిగా ఎదరుచూశారు. వరుసగా కాంగ్రెస్, బీజేపీ నేతలను కలవడంతో గందరగోళం నెలకొంది. కానీ ఫైనల్గా ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన నిన్న ఢిల్లీ కూడా వెళ్లారు. అయితే దీనిపై టీఆర్ ఎస్ స్పందించింది.ముఖ్యనేత, సీఎం కేసీఆర్ వర్గంలో ఒకరైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల పార్టీ లైన్ దాటి బీజేపీని కలిశారని, దీనిపై పార్టీ అధ్యక్షుడు ఏ చర్య అవసరమనుకుంటే ఆ చర్య తీసుకుంటారని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.ఈటల రాజేందర్ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్లను కలిశానని చెబుతున్నారని, మరి అప్పుడు తన ఆత్మగౌరవాన్ని ఎవరికి తాకట్టు పెట్టారని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ముందు నుంచి బహుజనవాదం, వామపక్షవాదం ఉన్న నేత అని, మరి ఇప్పుడు వాటిని ఎలా వదిలి బీజేపీలో చేరుతారని మండిపడ్డారు. అయితే ఈటలపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే అలా చేస్తే ఈటలకు సానుభూతి పెరుగుతుందని కేసీఆర్ యోచిస్తున్నారు. మరి చర్యలు ఉంటాయా లేదా చూడాలి.