హైదరాబాద్, జూన్ 8,
తెలంగాణలో లాక్ డౌన్ సడలింపు పొడిగించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి. కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ప్రగతి భవన్లో భేటీ అయింది. ఈ భేటీలో లాక్ డౌన్ సడలింపు అంశమే కాక, ఉద్యోగుల పీఆర్సీ అమలు, కరోనా థర్డ్వేవ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది జీతాల పెంపు, ఇంటర్ సెకండియర్ పరీక్షల నిర్వహణ, ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటు తదితర అంశాలపైన కూడా చర్చించనున్నారు. భేటీలో అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ అమలుపై కీలక ప్రకటన చేశారు. గతంలో సీఎం శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు గత ఏప్రిల్ నుంచే ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడిప్పడే కరోనా తగ్గుముఖం పడుతూ, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో పీఆర్సీపై సానుకూల ప్రకటన వెలువడుతుందని ఉద్యోగులు ఆశపడుతున్నారు.కరోనా వేళ ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రభుత్వానికి తాజాగా సిఫారసు చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో సాధించిన మార్కులకు సమానంగా సెకండియర్లోని ఆయా సబ్జెక్టుల్లో వేసి అందరినీ పాస్ చేయాలని ప్రతిపాదించింది. దీనిపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.దీంతోపాటు వైద్యం, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో మరికొన్ని అంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశముందని తెలుస్తుంది. వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరిగే అవకాశముంది. పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.