కామారెడ్డి జూన్ 14
కామారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన దాదాపు ఖరారైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నూతనంగా సమీకృత భవనాలను నిర్మిస్తున్న నేపథ్యంలో కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో భవన నిర్మాణాలు పూర్తికావడంతో సీఎం కేసీఆర్ ఆయా భవనాలను సైతం ప్రారంభించవచ్చు అని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ నెల 10న కలెక్టరేట్, ఎస్పీ భవనాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అనివార్య కారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడింది. అయితే సీఎం కేసీఆర్ మరోసారి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు ఆదివారం ఫోన్ చేసి 20వ తేదీన మధ్యాహ్నం 1 గంటలకు కామారెడ్డిలోని నూతన సమీకృత భవనాలను ప్రారంభించేందుకు వస్తున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవానికి భవనాలను సిద్ధంగా ఉంచి ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించినట్లు ప్రభుత్వ విప్ తెలిపారు. ఈనెల 20న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన ఉన్నందున నూతన భవనాలను ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వ విప్ జిల్లా కలెక్టర్ శరత్ తో పాటు జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి లకు సూచించారు.