యాదాద్రి భువనగిరి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా మంగళవారం నాడు యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఎన్వీ రమణ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ దంపతులు బాలాలయంలో ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు.
అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతోపాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఈఓ సీజేఐ దంపతులకు ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు. అంతకుముందు వీవీఐపీ అతిథి గృహం వద్ద అయనకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. లక్ష్మీనరసింహస్వామివారి దర్శనం అనంతరం ఆలయ పునర్ నిర్మాణ పనులను అయన పరిశీలించారు.
ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో చేపట్టిన నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్ పనులు, ఆలయ నగరిని జస్టిస్ ఎన్వీ రమణ పరిశీలించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.