YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ జలజగడం

మళ్లీ జలజగడం

కర్నూలు, జూన్ 22, 
రాజకీయాల్లో మిత్రులు అంటూ ఎవరూ ఉండరు, కానీ కొందరు మాత్రం తెర వెనక మితృత్వం బాగానే నెరపుతారు. మొదట్లో నువ్వా నేనా అన్నట్లుగా తలపడినా కూడా విభజనకు ముందే కేసీఆర్, జగన్ కలసిపోయారు అని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఏపీకి జగన్ సీఎం, తెలంగాణాకు కేసీఆర్ అని ఇటీవల మరణించిన నాయని నరసింహారెడ్డి ఆనాడే జోస్యం చెప్పారు. ఆ కల 2019 ఎన్నికల వేళ సాకారం అయింది. ఇక ఇద్దరు మిత్రులు రెండు తెలుగు రాష్ట్రాలను ప్రగతి వైపుగా పరుగులు పెట్టిస్తారు అని అంతా భావించారు. మొదట్లో కూడా అలాగే కధ నడచింది.ఇక జగన్ రాయలసీమకు చెందిన వారు, కేసీఆర్ తెలంగాణావాదంతో ఏకంగా రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. ఇద్దరికీ ప్రాంతీయ మమకారం మెండు. ఆ విషయంలో అసలు రాజీపడే ప్రసక్తే లేదు. ఇక జగన్ ప్రభుత్వం తాగు, సాగు నీటి కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం రాజోలిబండ (ఆర్డీఎస్) కుడికాల్వ నిర్మాణాలను చేపట్టింది. అయితే ఇవన్నీ కృష్ణా నదికి వరదల కారణంగా వచ్చిన నీరు సముద్రంలోకి పోకుండా మళ్ళింపు చేసుకోవడానికే. ఇందులో తెలంగాణాకు ఏ విధమైన నష్టం ఉండదు అని ఏపీ సర్కార్ అంటోంది. కానీ తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ ఈ నీటి పధకాల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చట్టాలను గౌరవించని జగన్ ని అడ్డుకుంటామని కూడా గర్జించారు.ఇపుడు కేసీఆర్ దీని మీద కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు చేస్తూనే వేరే రూట్లో కూడా రావాలని నిర్ణయించడమే ఇక్కడ చర్చగా ఉంది. అంటే అనుమతులు లేకుండా దాదాపుగా ఎనిమిది దాకా నీటి ప్రాజెక్టులు నిర్మించాలని కేసీఆర్ కచ్చితమైన నిర్ణయాన్నే తీసుకున్నారని అంటున్నారు. జోగులాంబ బ్యారేజీ పేరిట గద్వాల వనపర్తి జిల్లాల మధ్య అలంపూర్ వద్ద కృష్ణ నదిపై ఓ బ్యారేజీని నిర్మించాలని కూడా కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఇక్కడి నుంచి 60-70 టీఎంసీల వరద నీటిని తమ ప్రాంతాలకు వివిధ ప్రాజెక్టుల ద్వారా తీసుకుపోవాలని ప్రతిపాదిస్తున్నారు. మరి అదే జరిగితే రాయలసీమ ఎత్తిపోతల‌ పధకానికి వరదనీళ్ళు రాక ఎండాల్సిందే అంటున్నారు.రెండు రాష్ట్రాల మధ్య విభజన ఆస్తుల పంచాయతీ ఇంకా తెగలేదు. కోట్లగా విలువ చేసే ఆస్తులు ఏపీకి బదలాయింపు కావాల్సి ఉంది. దీని మీద ఇంతవరకూ కేసీఆర్ సర్కార్ ని జగన్ గట్టిగా అడిగింది లేదు. మరో వైపు చూస్తే రాయలసీమ నుంచి వచ్చిన జగన్ మంచి ఉద్దేశ్యంతోనే కృష్ణా నది వరద నీటిని ఉపయోగించుకోవాలని చూస్తే అది ఎగువ రాష్ట్రమైన తెలంగాణాకు కంటగింపుగా మారుతోంది. అనుకున్నట్లుగా వరదనీటికి గండి కొట్టేలా కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టులు నిర్మిస్తే సీమకు దారుణంగా అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా కేసీఆర్ తో జగన్ చర్చలు జరపాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారు కోరుతున్నారు. సమరమో, సామరస్యమో జగన్ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఏపీలోని రాజకీయ పక్షాలు అంటున్నాయి.

Related Posts