కరీంనగర్, జూన్ 25,
తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత మరికొందరు అసంతృప్త నేతల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేయడం, ఉద్యమంలో తామే ముందున్నామని భావించడం వంటి అభిప్రాయాలు ఇంకా చాలా మంది నేతల్లో ఉన్నాయి. అటువంటి నేతలను ఏరివేసే కార్యక్రమం కూడా టీఆర్ఎస్ లో ప్రారంభమయిందంటున్నారు. ఇందులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.రసమయి బాలకిషన్ కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో రసమయి బాలకిషన్ కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధూంధాం సభలను నిర్వహించి ప్రజలను చైతన్య వంతులను చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన రసమయి బాలకిషన్ కు రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్ మంచి ప్రాధాన్యత ఇచ్చారు.ఎన్నికయిన రసమయి బాలకిషన్ కు కేసీఆర్ కేబినెట్ హోదా గల నామినేట్ పోస్టు ఇచ్చారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఛైర్మన్ గా నియమించారు. అయితే రసమయి బాలకిషన్ లో అసంతృప్తి ఉందంటారు. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఆయన అసంతృప్తి నేతగా ముద్రపడ్డారు. అనేక సమావేశాల్లో రసమయి బాలకిషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన పాడిన పాటలు కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. దీనికి తోడు రసమయి బాలకిషన్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు సన్నిహితుడిగా కూడా ముద్రపడ్డారు. కరీంనగర్ జిల్లా కావడంతో ఈటలతో ఆయన సంబంధాలను ఎక్కువగా కొనసాగించారు. ఈటలను పార్టీ నుంచి పంపించి వేయడంతో రసమయి బాలకిషన్ కూడా రాజకీయంగా ఇబ్బందుల్ల పడినట్లేనంటున్నారు. అందుకే ఆయన ఈటల ఎపిసోడ్ తర్వాత బాలకిషన్ సైలెంట్ అయ్యారు. పార్టీ కూడా ఆయనను కొంత దూరం పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మానకొండూరు టిక్కెట్ రసమయికి దక్కే అవకాశాలు తక్కువేనంటున్నారు.