చేనేత వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం
ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్ జూలై 16
తెలంగాణలో చేనేత వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని.. ఇందుకు సంబంధించి త్వరలోనే శుభవార్త అందిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు.రాష్ర్ట అభివృద్ధికి తన వంతు సహకారానికి రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రమణకు మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందన్నారు. టీఆర్ఎస్లో చేనేత వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదన్న లోటు రమణ చేరికతో తీరిందన్నారు. చేనేత సామాజిక వర్గం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. చేనేతల అభివృద్ధి కోసం చాలా చేశాం.. కానీ సరిపోవడం లేదు.. చేనేత వర్గం సమున్నతంగా బతికేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. చేనేతల బాధలను విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. చేనేత కార్మికులకు రైతు బీమా కోసం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఒకట్రెండు నెలల్లో చేనేతలకు బీమా వర్తిస్తుందని సీఎం తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన చేనేత కార్మికులు సూరత్లో ఉన్నారు. ఈ క్రమంలో చేనేత కార్మికుల సమస్యలపై సూరత్కు అధికారులు పంపామని గుర్తు చేశారు. రాష్ర్టంలో జౌళి పరిశ్రమను ప్రోత్సహిస్తే తిరిగి వస్తామని చెప్పారు. వరంగల్లో వెయ్యి ఎకరాల్లో మెగా టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఒక పారిశ్రామికవేత్త 3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు అని సీఎం గుర్తు చేశారు.