హైదరాబాద్, జూలై 19,
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈసారి అధికారంలోకి రావాలన్న కసితో పనిచేస్తుంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీని బలోపేతం చేయడానికి వ్యూహకర్తలు రంగంలోకి దిగారు. కొందరు కీలక నేతలకు బాధ్యతలను అప్పగించారు. పక్కాగా పనివిభజన చేసి అనుకున్న గోల్ కొట్టాలన్నది బీజేపీ పెద్దల ఆలోచన. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే కొంత పట్టుఉండటమే ఇందుకు కారణం.బండి సంజయ్ పార్టీ అధ్యక్ష్య బాధ్యతలను చేపట్టిన తర్వాత పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్ ను అసలు పట్టించుకోకుండా అధికార పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసుకున్నారు. బండి సంజయ్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ కాలం మరో ఏడాది మాత్రమే ఉంది. అయితే ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీ అధ్యక్షుడిని మార్చే అవకాశం లేదు. ఈ మేరకు పార్టీ కేంద్ర నాయకత్వం బండి సంజయ్ కు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.అయితే అసెంబ్లీ ఎన్నికల్లో క్యాడర్ లో ధైర్యం, నేతలు ఇతర పార్టీల నుంచి రావాలంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక కీలకం. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే పార్టీకి మరింత ఊపు వస్తుంది. అందుకే బండి సంజయ్ ఆగస్టు నెలలో పాదయాత్ర చేయాలని తలపెట్టారు. ఆగస్టు 9న భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర మొత్తం 750 కిలోమీటర్లు సాగనుంది. అక్టోబరు 2వ తేదీన హుజూరాబాద్ లో ముగియనుంది.హుజూరాబాద్ ఎన్నికలో బీజేపీకి కొంత ఎడ్జ్ ఉన్నమాట వాస్తవమే. ఈటల రాజేందర్ అభ్యర్థి కావడంతో పార్టీ బలం కూడా పెరిగింది.ఇక్కడ గెలిచి రెండు ఉప ఎన్నికల్లో కేసీఆర్ ను దెబ్బకొట్టామన్న అంశాన్ని ఇటు నేతల్లోనూ, అటు ప్రజల్లోనూ బలంగా తీసుకెళ్లాలన్నది బండి సంజయ్ ఆలోచనగా ఉంది. అయితే పాదయాత్రతో ఎంతవరకూ ఉపయోగం అన్నది పక్కన పెడితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే చేరికలు భారీగానే ఉంటాయన్న అంచనా ఉంది=