మహబూబ్ నగర్
జూరాల ప్రాజెక్ట్ నుండి దిగువకు 20 గేట్లు ఎత్తివేసి శ్రీశైలం వైపు వరద నీరు వదలడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదకు తోడు స్థానికంగా కురుస్తున్న వానలతో కృష్ణా బేసిన్లోని జలాశయాలకు భారీగా ఇన్ఫ్లో వస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు 1.48 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం వస్తున్నది. దీంతో 20 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా లక్షకుపైగా 1,60,987 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.126 టీఎసీల నీరు నిల్వ ఉంది. వరద నీరు గంట గంటకు పెరుగుతూ వస్తున్నది. కావున పర్యాటకులు కృష్ణపరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు రెవిన్యూ అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని మొదటి హెచ్చరికలను కూడా అధికారులు జారీ చేశారు.