హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్ ఆగష్టు 11
హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. దళిత బంధు ప్రారంభ సమావేశం సందర్భంగా ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్లో నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ను నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు గులాబీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన గెల్లు మల్లయ్య, లక్ష్మీ దంపతులకు శ్రీనివాస్ యాదవ్.. 1983, ఆగస్టు 21న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఇదే యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నారు. ఇంటర్ వరకు కరీంనగర్ జిల్లాలోనే చదివిన శ్రీనివాస్.. ఉన్నత విద్య కోసం హైదరాబాద్కు వచ్చారు. గగన్ మహల్లోని ఏవీ కాలేజీలో బీఏ చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. అంబర్పేటలోని ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 2003 నుంచి 2006 వరకు హాస్టల్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ కాలంలో బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడారు.