దళితబంధు దేశానికే ఆదర్శం
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
సంగారెడ్డి ఆగష్టు 17
దళితబంధుతో దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.. దశలవారీగా దళితులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడం లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏడేళ్లలో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పఠాన్చెర్వు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో జరుగుతున్న ‘కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ’ ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన ఏడేళ్లకాలంలో కేసీఆర్ నాయకత్వంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణలో 17శాతం దళితులు ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రంలో దళితులు వివక్షకు గురవుతున్నారని, వారి జీవితాల్లో మార్పు రాలేదన్నారు. దళిత కుటుంబాలకు లాభం చేకూర్చే వరకు సీఎం కేసీఆర్ వదలన్నారు. రాజకీయ నాయకత్వం సరిగా పని చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదని, డేళ్లలో 2.23లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రాగా.. 15లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇప్పటి వరకు 1.39లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. రైతుబంధు కోసం రెండు సీజన్లలో కలిపి 62లక్షల మంది రైతులకు రూ.15వేల కోట్ల సాయం అందిస్తున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకం అమలు తర్వాత తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. ఏడేళ్లుగా సవాళ్లను అధిగమించి పని చేస్తున్నామన్నారు. రైతుబంధు పథకం అమలు చేసిన సమయంలో అనుమానాలు వ్యక్తం చేశారని, ఇప్పుడు 11 రాష్ట్రాలు పథకం పేరు మార్చి అమలు చేస్తున్నాయన్నారు. గతంలో వ్యవసాయం వర్షాలు, బోర్లమీద ఆధారపడి ఉండేదని.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంతో నీరు అందుతుందన్నారు. దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి సీఎం కిరణ్కుమార్రెడ్డి తెలంగాణ ఏర్పడితే కరెంట్ ఉండదని అన్నారని.. సీఎం కేసీఆర్ ఆరు నెలల్లో కరెంటు సమస్యను పరిష్కరించారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.