హైదరాబాద్ డిసెంబర్ 4
హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC) ఏర్పాటు చేయడం సంతోషకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఇవాళ హెచ్ఐసీసీలో జరిగిన IAMC సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, పలువురు న్యాయమూర్తులు హాజరైన ఈ సదస్సులో సీఎం మాట్లాడారు. నగరంలో IAMC ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఆయన తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్నివిధాలా అనువైన ప్రాంతమని సీఎం కేసీఆర్ చెప్పారు. అతితక్కువ కాలంలోనే హైదరాబాద్ నగరంలో ఎమర్జింగ్ సిటీగా ఎదిగిందని అన్నారు. హైదరాబాద్ అన్ని రకాల సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు, పెట్టుబడులకు అనువైనదన్నారు. ఇక, మధ్యవర్తిత్వం అనేది దేశంలో రచ్చబండ లాంటి వేదికల రూపాల్లో ఎప్పటి నుంచో ఉన్నదని చెప్పారు. గ్రామాల్లో పెద్దలు పంచాయతీలు ఏర్పాటు చేసి వివాదాలు పరిష్కరించేవారని అన్నారు.