YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

స్టీల్ ప్లాంట్ లో కోకింగ్ కోల్ కొరత

స్టీల్ ప్లాంట్ లో కోకింగ్ కోల్ కొరత

విశాఖపట్టణం, ఫిబ్రవరి 18,
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కోకింగ్ కోల్ కొరత ఏర్పడింది. ఉక్కు ఉత్పత్తిలో కోకింగ్ కోల్‌కి ప్రధాన భూమిక కావడంతో దాని కొరత కారణంగా బ్లాస్ట్ ఫర్నేస్ 3 ని మూసి వేశారు అధికారులు. దీంతో రోజుకు సరాసరి 15 వేల టన్నుల ఉక్కు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆస్ట్రేలియా నుంచి లక్ష టన్నుల కోకింగ్ కోల్ ని దిగుమతి చేసుకున్నా దానికి సకాలంలో డబ్బు చెల్లించలేకపోయింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. దీంతో ఆస్ట్రేలియా నుంచి గంగవరం వచ్చిన కోకింగ్ కోల్ షిప్ వెనక్కి వెళ్ళిపోయింది. విషయం తెలిసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దాన్ని కొనుగోలు చేసింది. అయితే ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో నష్టాలను చూపడానికి కోకింగ్ కోల్ నిల్వలను ఉంచుకోక పోగా బ్లాస్ట్ ఫర్నేస్ 3 ని మూసివేసేలా యాజమాన్యం కుట్ర పన్నుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు చాలా ఆవేదన కలిగిస్తున్నాయని అంటున్నారు కార్మికులు. ప్లాంట్ ప్రస్తుతం 6.3 మిలియన్ల ఉత్పాదకత దాటి 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి వైపు పరుగులు తీస్తోంది. అయితే నెల రోజుల క్రితం నుంచి కోకింగ్ కోల్ కొరత భారీ కుదుపునకు గురిచేస్తోంది. సాధారణంగా ఆరునెలల కు సరిపడే కోకింగ్ కోల్ నిల్వలు గతంలో ఉండేవి. ప్రైవేటీకరణ, కోవిడ్ నేపథ్యంలో ఆ నిల్వలు భారీగా పడిపోయాయి. కోకింగ్ కోల్ ఆస్ట్రేలియా, ఇండోనేషియాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జనవరి నెల చివరి వారంలో ఆస్ట్రేలియా నుంచి గంగవరం పోర్ట్ కి లక్ష టన్నుల కోకింగ్ కోల్ షిప్ వచ్చింది. అయితే దానికి నగదు చెల్లించి తీసుకోవాలి. కానీ అందుకు అవసరమైన 12 కోట్ల వర్కింగ్ కాపిటల్ లేకపోవడంతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బ్యాంక్ ఋణాలవైపు చూసింది. ప్రైవేటీకరణ ప్రకటన నేపథ్యంలో ఏ బ్యాంక్ కూడా సహకరించకపోవడంతో నగదు చెల్లించలేకపోయింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. దీంతో కంసైన్మెంట్ రద్దయింది. అసలే ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో గంగవరం పోర్ట్ కు వచ్చిన కోకింగ్ కోల్ వెనక్కి వెళ్ళిపోయింది. విషయం తెలుసుకున్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా 12 వేల కోట్లు చెల్లించి దాన్ని తీసేసుకుంది. దాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్న అన్ని ఉక్కు కంపెనీ లకు అందించింది.సుమారు రూ.2.50 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న స్టీల్ ప్లాంట్ రూ. 12 వేల కోట్లు చెల్లించలేక రోజుకు 15 వేల టన్నుల ఉత్పత్తి ని నిలిపివేసిందంటే కార్మిక సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయ్. ఇది సాధారణ విషయం ఎంతమాత్రం కాదనీ, ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కోకింగ్ కోల్ ని ఐరన్ ఓర్ తో కలిపి ఉక్కు తయారీలో వాడుతారు. మన రాష్ట్రంలో, దేశంలో లభించే ఉక్కు కూడా వినియోగించవచ్చు. కానీ ఈ కోల్ లో బూడిద పరిణామం ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియాల నుంచి దిగుమతి చేసుకునే కోకింగ్ కోల్ లో బూడిద పరిణామం సున్నా శాతం కాగా దాని నుంచి వెలువడే ఉష్ణోగ్రత సాధారణ కోల్ కంటే 100 రెట్లు ఎక్కువ. దానికి తోడు కోకింగ్ కోల్ విడుదల చేసే గ్యాస్ నుంచి రోలింగ్ షాప్స్, మెల్టింగ్ యూనిట్స్ లాంటివి తక్కువ సమయంలో నాణ్యమైన ఉత్పత్తికి దోహదం చేస్తుంది. అంతటి ప్రధానమైన వనరు విషయంలో యాజమాన్య నిర్లక్ష్య వైఖరి పై కార్మక లోకం మండిపడుతోంది.ఒక్క కోకింగ్ కోల్ విషయంలోనే కాదు, మిగతా అన్ని విషయాల్లోనూ ఇదే వైఖరిని అవలంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మిక సంఘ నేతలు. స్పేర్ పార్ట్ దగ్గరనుంచి పలు యూనిట్ల పర్యవేక్షణ వరకు ఉద్దేశ్యపుర్వకంగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నది కార్మిక నేతల విమర్శ. భారత దేశంలోనే అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ లో ప్రస్తుతం ఏదైనా ముఖ్యమైన పార్ట్స్ పోతే వాటి విడిభాగాలకోసం ఒక్కోసారి విదేశాలనుంచి కూడా తెప్పించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏదైనా సమస్య తలెత్తితే ఇక దాన్ని ఔట్ సోర్స్ కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఇవన్నీ ప్లాంట్ సామర్ధ్యాన్ని దెబ్బతీసే, దాని ద్వారా ప్రైవేటీకరణను సులభవంతం చేసే కుట్ర ఇది అన్నది కార్మిక నేతల గగ్గోలు.కోకింగ్ కోల్ కొరత విషయం తెలిసి ఈనెల 3న ప్లాంట్ ఇండిపెండెంట్ డైరెక్టర్లు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఇలా జరిగితే నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకునేవాళ్ళు కానీ ఈసారి అత్యవసర సమావేశం జరిగినా సంతాపం ప్రకటించి వెళ్లిపోయారన్నది కార్మికుల ఘోష. ఇప్పటికైనా ప్రైవేటీకరణతో సంబంధం లేకుండా ప్లాంట్ ఉత్పత్తిని పూర్తిస్తాయిలో తిరిగి పునరుద్ధరించాలని కార్మికులు కోరుతున్నారు.

Related Posts