హైదరాబాద్, మార్చి 5,
"తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి ఇంట్లో కాలుజారి పడ్డారు. చేతికి గాయమైంది. వైద్యులు విశ్రాంతి తీసుకోమన్నారు. మార్చి 4 వరకు లీవ్ పెట్టారు." ఇదంతా అధికారిక వర్షన్.కాదు కాదు.. డీజీపీని సీఎం కేసీఆర్ పక్కనపెట్టేస్తున్నారు. సెలవుల్లో వెళ్లమని ఆదేశించారు. ఆయన ప్లేస్లో బీహార్కు చెందిన అంజనీ కుమార్ను డీజీపీ చేయాలని ముఖ్యమంత్రి చూస్తున్నారు. తెరవెనుక ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీ. సీఎస్, డీజీపీలతో పాటు కీలక స్థానాలన్నిటినీ బీహారీ బాబులతో నింపేసి.. ప్రతిపక్షాలను తొక్కేసేలా.. తెలంగాణలో అరాచక పాలన జరపాలనే పీకే వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారు." ఇది పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపణ. అలాంటిదేమీ లేదు. రేవంత్రెడ్డి ఆరోపణలు సరికాదు. రాజకీయాల్లోకి తమలాంటి అధికారులను లాగడం మంచిదికాదు. భుజానికి గాయమైంది. మార్చి 4 వరకూ లీవ్ పెట్టా. అంతే. అంటూ డీజీపీ మహేందర్రెడ్డి మళ్లీ క్లారిటీ ఇచ్చారు. డీజీపీ చుట్టూ పొలిటికల్ చిచ్చు.. బీహార్ రొచ్చు.. జరుగుతుండగా.. ఆ "మార్చి 4" రానే వచ్చింది. మహేందర్రెడ్డి పెట్టిన సెలవు ముగిసింది. మరి, మార్చి 5న డీజీపీ తిరిగి విధుల్లో చేరుతారా? సెలవులకు సెలవు చెప్పి.. డ్యూటీ రెజ్యూమ్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. మహేందర్రెడ్డి తన సెలవులు పొడిగించుకుంటారని కొందరు అంటున్నారు. మళ్లీ అదే వైద్యుల సూచనంటూ సాకు చెప్పి.. విధులకు దూరమవుతారని ఉన్నతస్థాయి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లేదంటే.. కేసీఆరే ఆయన్ను మళ్లీ సెలవులపై పంపిస్తారని.. ఆ అవమానం కంటే ఆయనే దూరంగా ఉండటం బెటరని భావిస్తున్నారని మరో వర్గం అంటోంది. ఎలాగైనా డీజీపీ సీటు నుంచి మహేందర్రెడ్డిని తప్పించి.. బీహారీని డీజీపీ చేస్తారని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మార్చి 5న కాస్త క్లారిటీ రానుంది. ఆయన తిరిగి విధుల్లో చేరకపోతే ఆ అనుమానం మరింత బలపడుతుంది. ఒకవేళ మహేందర్రెడ్డి వెంటనే డ్యూటీలో జాయిన్ అయితే మాత్రం ఆ ప్రచారం కొద్దిరోజులు సద్దుమనుగుతుంది. ఇప్పుడు విధుల్లో చేరినా.. మళ్లీ కొన్నాళ్లకూ.. ఏపీ డీజీపీలా.. పక్కకు తప్పించడం ఖాయమనే వాదనా వినిపిస్తోంది. పీకే డైరెక్షన్లో బీహారీని పోలీస్ బాస్ చేసే వరకూ.. ఈ వివాదం ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.