YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆరు నెల‌ల్లో ఆర్డీఎస్ ఎలా పూర్తి చేస్తావు..?

ఆరు నెల‌ల్లో ఆర్డీఎస్ ఎలా పూర్తి చేస్తావు..?

హైద‌రాబాద్ ఏప్రిల్ 22
ఆర్డీఎస్‌ (రాజోలిబండ డైవ‌ర్ష‌న్ స్కీం) పై బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేసిన‌ వ్యాఖ్య‌ల‌ను రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. ఆయ‌న‌కు ఆర్డీఎస్ కొన తెల్వ‌దు.. మొన తెల్వ‌దు అని నిరంజ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల పంపులు తెల్వవు.. రిజ‌ర్వాయ‌ర్లు తెల్వ‌వు అని నిప్పులు చెరిగారు. ప్రాజెక్టుల గురించి తెల‌వ‌కుండా మాట్లాడితే కనీసం ప్రజలు నవ్వుకుంటున్నారన్న ఇంగితం కూడా సంజ‌య్‌కు లేద‌ని ఎద్దెవా చేశారు.ఆరు నెలల్లో ఆర్డీఎస్ ఎలా పూర్తి చేస్తావో కాగితం రాసిస్తావా? అని బండిని నిరంజ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏ పనులు చేపడతావ్ ? ఎక్కడ నుండి నిధులు తెస్తావో ప్రజలకు వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు తెచ్చే దమ్ముందా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఆర్డీఎస్ కాలువను నిజాం ప్రభుత్వం ప్రతిపాదించింది. 1946లో ప‌నులు ప్రారంభ‌మై 1958లో పూర్తయిందని మంత్రి తెలిపారు. తుంగభద్ర నదిపై రాయచూర్ జిల్లా మాన్వి వద్ద నిర్మించిన అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు పూర్తి ఆయ‌క‌ట్టు 93,379 ఎకరాలని నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.
క‌ర్ణాట‌క నీరిచ్చినా దాఖ‌లాలు లేవు..
ఆర్డీఎస్‌కు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ 17.1 టీఎంసీల నీటిని కేటాయించిందని మంత్రి గుర్తు చేశారు. ఆర్డీఎస్ ప్ర‌ధాన కాలువ మొత్తం 142 కిలోమీట‌ర్లు కాగా, మొద‌టి 42 కిలోమీట‌ర్లు క‌ర్ణాట‌క‌లో, మిగ‌తా 100 కిలోమీట‌ర్లు తెలంగాణ‌లో ఉంద‌న్నారు. ఈ కాలువ ద్వారా అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి తాగు, సాగునీరు అందించ‌డం ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని మంత్రి తెలిపారు. కానీ ఆర్డీఎస్ కాలువ ద్వారా ఎన్నడూ కర్ణాటక సంపూర్ణంగా నీరిచ్చిన ధాఖలాలు లేవు. అలంపూర్ తాలూకాలో 87,500 ఎకరాల ఆయకట్టుకు 15.9 టీఎంసీల నీరందించాలి. కానీ ఇప్పటి వరకు ఎన్నడూ 20 వేల ఎకరాలకు నీళ్లు పారలేదని నిరంజ‌న్ రెడ్డి తెలిపారు.ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు మద్దతుగా 2003 జులై 16న‌ అలంపూర్ జోగుళాంబ ఆలయం వద్ద కేసీఆర్ పాదయాత్ర ప్రారంభించారు. జులై 25 వ‌ర‌కు పాద‌యాత్ర కొన‌సాగించి.. గ‌ద్వాల‌లో ల‌క్ష మందితో బ‌హిరంగ‌స‌భ నిర్వ‌హించిన విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆ త‌ర్వాత 2003, ఆగ‌స్టులో ఆర్డీఎస్ ఆయ‌క‌ట్టు రైతాంగానికి జ‌రుగుతున్న అన్యాయంపై ఉమ్మ‌డి ఏపీలోని ఎంపీలంద‌రికీ కేసీఆర్ బ‌హిరంగ లేఖ‌లు రాసిన విష‌యాన్ని కూడా నిరంజ‌న్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ తీసుకున్న ఈ చర్యల ద్వారానే ఆర్డీఎస్ సమస్యపై 2004 లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. ఆర్డీఎస్ ద్వారా తెలంగాణ‌కు సాగునీరు అందడం లేదని ఆ క‌మిటీ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 2014 వరకు ఎటువంటి చర్యలు లేవు. అనేకమార్లు టీఆర్ఎస్ ఆర్డీఎస్ ఆయకట్టుపై ఉద్యమించిందని నిరంజ‌న్ రెడ్డి గుర్తు చేశారు.2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీ డిజైన్ చేస్తున్న నేపథ్యంలో ఆర్డీఎస్ మీద సంపూర్ణ సమీక్ష నిర్వహించార‌ని నిరంజ‌న్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి 2017లో తెలంగాణ ప్రభుత్వం జీఓ 429 విడుదల చేస్తూ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రూ.780 కోట్లతో చేపట్టి కేవలం పది నెలలలో పూర్తిచేసింది. తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్లను ప్రతిపాదించారు. ఈ రిజర్వాయర్లకు సంబంధించిన సర్వే పూర్తయిందని తెలిపారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్డీఎస్ కాలువ కింద సాగునీరందని, 50 వేల ఎకరాలకు నీరందించడం జరుగుతున్నదని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు ఇస్తానన్న మాటను తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నిలబెట్టుకున్నారని మంత్రి నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు.పుట్టిన నడిగడ్డను, తెలంగాణను గాలికి వదిలేసి, ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు అన్యాయం చేసి దోచుకుపోయిన హాంద్రీనీవా నీళ్లకు హారతిపట్టిన డీకె అరుణను పక్కనపెట్టుకుని బండి సంజయ్ ఆర్డీఎస్ ఆయకట్టు గురించి మాట్లాడడం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని మంత్రి అన్నారు.
సంజ‌య్‌కు ఆర్డీఎస్‌పై అవ‌గాహ‌న ఉందా..?
అసలు ప్రాజెక్టుల మీద బండి సంజయ్‌కు ఉన్న అవగాహన సున్నా.. అరవై ఏండ్ల కింద పూర్తయిన ఆర్డీఎస్‌ను ఆరునెలలలో పూర్తి చేస్తాననడం అవివేకం.. అవగాహనారాహిత్యం అని నిరంజ‌న్ రెడ్డి అన్నారు. నిజాం ప్రభుత్వం గద్వాల, వనపర్తి, అలంపూర్, కొల్లాపూర్ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు అప్పర్ కృష్ణా ప్రాజెక్టును, దానిలో భాగంగా గద్వాల కాలువను ప్రతిపాదించిన విష‌యాన్ని గుర్తు చేశారు. దీని ద్వారా దాదాపు 200 టీఎంసీల సాగు నీరు ఉమ్మడి పాలమూరు జిల్లా వాడుకునే అవకాశం ఉండేది. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రలో విలీనం కావడం, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ కాలువ కర్ణాటక వరకే కుదించబడిందని తెలిపారు. ఈ రోజు అప్పర్ కృష్ణాలో భాగమైనటువంటి నారాయణపూర్, ఆల్మట్టి డ్యాంలలో దాదాపు 50 టీఎంసీలు ఈ వేసవిలో నిలువ ఉన్నాయి. జూరాల, శ్రీశైలం ఎండిపోయాయి. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఎండాకాలంలో జూరాలను నింపే దమ్ము, ధైర్యం ఉందా ? ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ వద్ద 87,500 ఎకరాలకు సాగునీరు తీసుకువెళ్లేలా పనులు చేపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకురాగలిగే దమ్ముందా ? అని నిరంజ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు.
ప్రాజెక్టుల గురించి వంక‌లు పెట్ట‌డం హాస్యాస్ప‌దం..
ఆర్డీఎస్ కాలువకు సాగునీరు తీసుకువచ్చే ప్రాంతం కర్ణాటకలో ఉంది. అక్కడ తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టడం సాధ్యం కాదని మంత్రి స్ప‌ష్టం చేశారు. సుంకేశుల తెలంగాణ వచ్చే వరకు పూర్తిగా నూటికి నూరుపాళ్లు ఆంధ్రాకు ధారాదత్తం. ఇప్పుడు అదే సుంకేశుల నుండి తుమ్మిళ్ల ఎత్తిపోతలకు సాగునీరు లిఫ్ట్ చేస్తున్నామ‌ని తెలిపారు. పాలమూరు వాగులు, వంకలు తెలియని వాళ్లు పాలమూరు ప్రాజెక్టుల గురించి వంకలు పెట్టడం హస్యాస్పదంగా ఉంద‌ని నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

Related Posts