హైదరాబాద్ ఏప్రిల్ 30
విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. క్రీడలలో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా తయారవుతారని చెప్పారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో ఉచిత వేసవి శిక్షణా శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేలా అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున విద్యార్ధులకు శిక్షణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.తెలంగాణ నుంచి అనేకమంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలలో తమ ప్రతిభను చాటి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో ప్రతిభ చాటే విధంగా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం ఆరు జోన్లలో 854 సమ్మర్ కోచింగ్ క్యాంప్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ క్యాంప్లలో అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, కరాటే, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ వంటి తదితర 44 రకాల క్రీడలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, నెల రోజులపాటు క్యాంప్ కొనసాగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.