హైదరాబాద్, ఏప్రిల్ 30
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏపీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. పక్క రాష్ట్రం ఏపీలో కరెంటు, నీళ్లు లేవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో ఏపీ మంత్రులు కేటీఆర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదేం ఎన్నికల స్టంట్ కాదంటూ చురకలంటిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. క్రెడాయ్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలోని తన స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండొచ్చంటూ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని.. ఎవరినో బాధపెట్టాలనో.. కించపరచాలనో అలా మాట్లాడలేదంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్ ను సోదర సమానుడిగా భావిస్తున్నానని.. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్లో పేర్కొన్నారు.క్రెడాయ్ సమావేశంలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. సంక్రాంతికి ఏపీలోని సొంతూళ్లకు పోయిన తన ఫ్రెండ్స్ రాష్ట్రంలో పరిస్థితులు ఆధ్వాన్నంగా ఉన్నాయంటూ చెప్పారంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరెంట్ లేదు. నీళ్లు లేవు. రోడ్లు ధ్వంసమయ్యాయి. తిరగడానికి లేదని .. చాలా నరకంలో ఉన్నామని.. హైదరాబాద్ వచ్చేవరకు ప్రశాంతంగా ఉండలేకపోయామంటూ తనతో చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా.. దీనిపై ఏపీలోని అధికార పార్టీ నాయకులు కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.