హైదరాబాద్, మే 2,
ఎన్నికల్లో ఓట్లు పడాలంటే.. సెంటిమెంట్ రాజేయాలి. అలా అయితే మళ్లీ అధికారం హస్తగతమవుతోంది. తాజాగా ఇదే ట్రెండ్ను ఫాలో అవుతోన్నాయి తెలుగు రాష్టాల్లోని రూలింగ్ పార్టీలు ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కరెంట్ కోతలు, నీటి కష్టాలు, రహదారుల పరిస్థితి పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉరుములేని పిడుగులా మాటలతో విరరుచుకుపడ్డారు. ఆయన అలా అన్నారో లేదో.. ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ నేతలు తెలంగాణపై ఒంటి కాలి మీద లేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక అడుగు ముందుకు వేసి, విభజన హామీల అమలులో భాగంగా ఇంకా 50 నుంచి 60 వేల కోట్ల రూపాయిల నగదు రూపంలో రాష్ట్ర వాటా కింద ఏపీకి రావాల్సి ఉందంటూ విభజన కారణంగా ఏపీ అన్యాయానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి ఇంకా బకాయిలు రావాలసి ఉందని, ఏపీ సొమ్ముతో తెలంగాణ సోకులు చేసుకుంటోందన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు. తెలంగాణలో నిన్న మొన్నటి వరకు విద్యుత్ కోతలు ఉన్నాయని.. రహదారులు పరిస్థితి కూడా అంతగా బాగోలేదంటూ సజ్జల మీడియావివరించారు. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్లు.. కేటీఆర్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ, తెలంగాణ సీఎం అద్భుతంగా పాలిస్తున్నారని కితాబులిస్తుంటే.. ఏపీ మంత్రి బొత్స.. హైదరాబాద్లో కూడా కరెంట్ కోతలన్నాయని.. తన ఇంట్లో విద్యుత్ కోత వల్ల జనరేటర్ వేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య ఇంతా వాడి వేడి చర్చ జరుగుతున్న సమయంలోనే ఏపీ మంత్రి రోజా.. తెలంగాణ సీఎం కేసీఆర్తో భేటీ కావడం.. అలాగే టీఆర్ఎస్ ప్లీనరీ జరిగిన 48 గంటల్లోనే మళ్లీ ఆంధ్రలో పరిస్థితులపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. మళ్లీ ఆంధ్ర - తెలంగాణ సెంటిమంట్ రగిలించి.. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీల నేతలు ఏదో ఓ విధంగా రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇటు ఏపీ మంత్రులు కానీ.. అటు తెలంగాణ మంత్రులు కానీ వీసమెత్తు మాటలు మాట్లాడలేదని ఈ సందర్బంగా వారు గుర్తు చేస్తున్నారు. చివరికీ ఆంద్రప్రదేశ్కు రావలసిన హక్కులన్నీ తెలంగాణ సీఎం కెసిఆర్ కాళ్ల వద్ద సీఎం జగన్ వదిలేసి.. రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఇప్పటికే ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతున్న సంగతిని ప్రస్తావిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా అధికార పీఠం ఎక్కి మూడేళ్లయితే.. ఇప్పటి వరకు గుర్తుకు రాని విభజన హామీలు.. ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పొలిటికల్ డ్రామాయేనని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ప్రజల్లో బాగా పడిపోయిందనీ, వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు రానున్నాయని, ఈ నేపథ్యంలో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలంటే ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ తప్ప వేరే గత్యంతరం లేదని.. కేసీఆర్ జగన్ లు భావించడం వల్లే తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు విభజన హామీ3ల పల్లవి అందుకున్నాయని సోషల్ మీడియాలో అయితే తెగ ట్రోల్ అవుతోంది. మరి తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఎన్నికల తెర తీసిన ఈ కొత్త డ్రామా వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలంటూ సామాజిక మాధ్యంలో వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ముఖ్యమంత్రి కావడానికి నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన సాయం అంతా ఇంతా కాదని... అలాగే కేసీఆర్ చేసిన సాయానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ జగన్ చేసిన త్యాగం అంతకన్నా వంద రెట్లు అధికమని నెటిజన్లు పేర్కొంటున్నారు.