YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

క్రుంగిపోతున్న వంతెన

క్రుంగిపోతున్న వంతెన

విశాఖపట్టణం, మే 13,
అనకాపల్లి జిల్లాలో దశాబ్దాలుగా ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడిన వంతెన ఉన్నట్టుండి కుంగిపోయింది. పిల్లర్ పక్కకు ఒరిగిపోవడంతో పెద్దేరు వంతెన కుంగింది. దీంతో నర్సీపట్నం-చోడవరం మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అనకాపల్లి జిల్లాలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఓ వంతెన కుంగిపోయింది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది సమీపంలోని పెద్దేరు నదిపై ఉన్న వంతెన బుధవారం రాత్రి 12 గంటల సమయంలో కుంగిపోయింది. మధ్య భాగంలో ఉన్న పిల్లర్ పక్కకు ఒరిగిపోవడంతో... వంతెన ప్రమాదకరంగా మారింది. దీంతో చోడవరం-నర్సీపట్నం మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.ఇటీవల కాలంలో పెద్దేరు జలాశయం నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినప్పుడు, ఇతర గెడ్డలు కలసి నీరు ఉధృతంగా ప్రవహించినప్పుడు కూడా ఈ వంతెన చెక్కుచెదరలేదు. ఎనో వరదలు, తుఫాన్లను తట్టుకొని నిలబడిన ఈ బ్రిడ్జి మధ్యలో కుంగిపోవడానికి ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలే కారణమనే ఆరోపణలు ఉన్నాయి.అధిక బరువుతో ఉన్న గ్రానైట్ లారీలు తరచూ బ్రిడ్జిపై నుంచి ప్రయాణించడం కూడా వంతెన దెబ్బతినడానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. నర్సీపట్నం వెళ్లే మార్గానికి ఈ వంతెన వడ్డాది ప్రాంత ముఖద్వారం కావడంతో.. చోడవరం నుంచి నర్సీపట్నం, పాడేరు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం ఈ వంతెన పైకి పాదచారులు, టూవీలర్లను మాత్రమే అనుమతిస్తున్నారు.ఈ విషయమై అనకాపల్లి జిల్లా ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ మాట్లాడుతూ.. శారదానదిపై తాత్కాలిక వంతెన ఏర్పాటుకు సుమారు నెల రోజులు పడుతుందన్నారు. దీనికి 50-60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. నదిపై కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు.

Related Posts