ఖమ్మం, జూన్ 29,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప, ఆరుగురు వార్డు సభ్యులు 160 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. తమ గ్రామ, భూ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా తలపెట్టిన ప్రగతి భవన్ పాదయాత్రను విరమించుకోవాలని అగ్రనాయకులు తీవ్రంగా వత్తిడి తెచ్చారని.. అందుకు నిరాకరించడంతో కక్ష గట్టి అక్రమ అరెస్టులు చేయించారని.. తమపై పోలీసులు దాడి చేసి అక్రమ అరెస్ట్ చేస్తే సొంత పార్టీకి చెందిన ఒక్కరు కూడా స్పందించలేదని.. అటువంటి పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.స్థానిక ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి పాదయాత్ర విరమించకపోతే ఇబ్బంది పడతారని, పై స్థాయిలో ఉన్న మాలాంటి వారు చెప్పినప్పుడు విని తీరాలని బెదిరింపులకు పాల్పడ్డారని.. అలానే నూతన ఎంపీడీవో కార్యాలయం ప్రారంభానికి రామన్నగూడెం గ్రామ పంచాయతీ నుంచి 5 వేలు బలవంతంగా వసూలు చేశారని.. హరితహారం మొక్కల కొనుగోలులో కూడా అవకతవకలకు పాల్పడ్డారని రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప పలు ఆరోపణలు చేశారు. జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి ఎంపీపీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే రాజీనామా విషయం తెలుసుకున్న అశ్వారావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు జారే ఆదినారాయణ, అశ్వారావుపేట జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మిలు సర్పంచ్ మడకం స్వరూప ను పరామర్శించారు.