హైదరాబాద్, జనవరి 24,
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ నెల 26న నిర్వహించాల్సిన గణతంత్ర వేడుకలపై సస్పెన్స్ వీడడం లేదు. వేడుకలను ఎక్కడ నిర్వహించాలనే దానిపై సీఎంవో నుంచి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు ఇప్పటివరకూ ఎలాంటి ఆదేశాలు రాలేదని సమాచారం. గతేడాది లాగే ఈసారి కూడా రిపబ్లిక్ డే వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహిస్తారని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2021, అంతకుముందు సంవత్సరాల్లో రిపబ్లిక్ డే వేడుకలను పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి గవర్నర్ హాజరై ప్రసంగించే ఆనవాయితీ పాటించింది. కానీ రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య గ్యాప్ పెరగడంతో గతేడాది నుంచి ప్రభుత్వం ఆనవాయితీలను పక్కనపెడుతూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ కు ఆహ్వానం పంపడంలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గోల్కొండ కోటలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు, పబ్లిక్ గార్డెన్ లో గణతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం నిర్వహిస్తోంది. కానీ ఈ సారి కూడా పబ్లిక్ గార్డెన్ లో రిపబ్లిక్ వేడుకలు లేనట్టే కనిపిస్తోంది. రాజ్ భవన్ లోనే జాతీయ జండా ఎగురవేయనున్నారు గవర్నర్. ఉదయం పతాకావిష్కరణ గావించి.. సాయంత్రం ఎట్ హోం నిర్వహించనున్నారు.పోయిన ఏడాది కరోనా సాకుతో ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహించలేదు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో జెండాను ఆవిష్కరించారు. గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో వేడుకలు నిర్వహించి.. ప్రభుత్వం పంపిన స్పీచ్ కాపీని చదివారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ ఇతర వివరాలను కలిపి గవర్నర్ ప్రసంగించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కాలేదు. ఇక ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పథకాలు, ఇతర ముఖ్య కార్యక్రమాల వివరాలతో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి స్పీచ్ కాపీలు జీఏడీకి అందాయి. వాటన్నింటి నుంచి పూర్తి స్థాయి స్పీచ్ను తయారు చేసి గవర్నర్ ప్రసంగానికి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ రిపబ్లిక్ డే వేడుకల కోసం గవర్నర్ కు ఎలాంటి ఆహ్వానం వెళ్లలేదు. దీనిపై ఉన్నతాధికారులకు కూడా ఎలాంటి సమాచారం లేదు. టైం ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నా.. ఏర్పాట్లపై అటు పోలీస్ శాఖ, ఇటు కల్చరల్ శాఖ, జీఏడీ మాత్రం కిమ్మనడం లేదు. గవర్నర్కు స్పీచ్ కాపీ ఇస్తారు కానీ.. ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం పిలవరు అన్న విమర్శలు వస్తున్నాయి.