హైదరాబాద్, మార్చి 26
తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలక సూత్రధారి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు అని పోలీసులు నిర్థారించారు. ఎస్ఐబీని రాజకీయ ప్రయోజనకాల కోసం దుర్వినియోగం చేసినందుకు కీలక బీఆర్ఎస్ నేతపై చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు, టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావుపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఓ ప్రాంతీయ మీడియా ఛానెల్కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్పై కూడా లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు.ఈ కేసులో అనుమానితులుగా ఉన్న ముగ్గురినీ ప్రశ్నించాలని పోలీసులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, సన్నిహితులపై పూర్తి నిఘా ఉంచాలని ప్రభాకర్రావుకు ఆదేశాలు అందిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు ఈటల రాజేందర్, రఘునందన్రావుపై నిఘా పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రాధా కిషన్రావు కొందరిని బెదిరించారని, మీడియా ఎగ్జిక్యూటివ్ తో కీలక విషయాలను పంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫోన్ ట్యాపింగ్ సామాగ్రి, హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసి మూసి నదిలో, అటవీ ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. వారిలో కొన్నింటిని రికవరీ చేసిన పోలీసులు... డేటా రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమాచారం తిరిగి లభిస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టించనుంది.ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావుపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించగానే, మాజీ చీఫ్ ప్రభాకర్రావు, మరో అధికారి రాధా కిషన్ రావు పరారైనట్లు సమాచారం. ప్రభాకర్ రావు ట్రిప్ పేరుతో చెన్నైకి వెళ్లి అక్కడి నుంచి అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసులు కీలక వ్యక్తుల్లో ముగ్గురు ప్రస్తుతంలో అమెరికాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ఓ ఉన్నతాధికారితో మాట్లాడినట్లు సమాచారం. ఇప్పటి ప్రభుత్వం చెప్పినట్లు మీరు ఎలా పనిచేస్తున్నారో... గత ప్రభుత్వం చెప్పినట్లు మేం పనిచేశామన్నారట. మా ఇళ్లలో ఎందుకు సోదాలు చేస్తున్నారని ఆ ఉన్నతాధికారిని ప్రభాకర్ రావు ప్రశ్నించినట్లు సమాచారం. తాను కేన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చానని, జూన్ లేదా జులైలో తిరిగి హైదరాబాద్కు( వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఉన్నతాధికారి ప్రభాకర్రావును మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే అధికారిక మెయిల్కు సమాధానం రాసి పంపాలన్నారట. దీంతో ప్రభాకర్రావు సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేసినట్లు సమాచారం.