హైదారాబాద్, మార్చి 29,
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కు వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేశారు. బీఆర్ఎస్లో కేకేకి అత్యున్నత స్థానం కల్పించారు కేసీఆర్. అలాంటి వ్యక్తి పార్టీని వీడుతారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ కేకే మాత్రం కారు దిగాలని డిసైడ్ అయ్యారు. ఈనెల 22న కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ స్వయంగా కేశవరావు నివాసానికి వెళ్లారు. కేశవరావుతో పాటు ఆయన కూతురు, మేయర్ విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీపాదాస్ మున్షీ ఆహ్వానంతో.. తండ్రి, కూతురు ఇద్దరూ బీఆర్ఎస్ను వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎర్రవెల్లిలోని ఫామ్హౌస్కు వెళ్లి కేసీఆర్కు కేశవరావు స్వయంగా వివరించారు.కేశవరావు పార్టీ మార్పు ప్రతిపాదనపై కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ మారితే ప్రజలు ఏమంటారో ఆలోచించారా అని ప్రశ్నించారట. అయినా బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని కఠిన నిర్ణయం తీసుకుంటున్నారో చెప్పాలని నిలదీసినట్టు సమాచారం. దేనికీ సమాధానం ఇవ్వని కేకే.. చివరగా కాంగ్రెస్లోనే చనిపోతానని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.ఎంపీ కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షితో సమావేశం అయ్యారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన యూట్యూబ్ మీడియాలకు ఇంటర్యూలు ఇస్తూ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని చెబుతున్నారు. గురువారం ఆయన తాను పార్టీ మారుతున్నట్లుగా కేసీఆర్కు చెప్పేందుకు ఫామ్ హౌస్కు వెళ్లారు. తనకు ఉన్న ఇబ్బందులు చెప్పి పార్టీ మారుతున్నానని కేసీఆర్ కు చెప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పార్టీ అధినేత అసహనానికి గురైనట్లుగా తెలుస్తోంది. పదేళ్ల పాటు పార్టీలో పెద్ద పీట వేసి పదవులు ఇస్తే.. కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఉన్న ఇబ్బందులను ఆయన చెప్పబోగా.. సాకులు చెప్పవద్దని మండిపడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన సమావేశం మధ్యలోనే వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ తనకు తక్కువ చేయలేదని, ఆది నుంచి మర్యాదలు చేసిందని ఎంపి కెకె తెలిపారు. తెలంగాణ కోసం అప్పుడు పార్టీ మారానని వివరణ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నామని, నెరవేరిందని, సొంత పార్టీ వైపు చూస్తే తప్పేంటని వాదిస్తున్నారు. కుమార్తె పదవి కోసం ఆయన పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేశవరావు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవి కాలం2026 వరకూ ఉంది. పార్టీ మారినందున తనపై అనర్హతా వేటు వేయకుండా.. కేసీఆర్ తో సత్సంబంధాలు పెట్టుకునేందుకు ఆయనకు వెళ్లినట్లుగా భావిస్తున్నారు. కానీ పరిస్థితి రివర్స్ అవడంతో సైలెంట్ గా వచ్చేశారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. కేసీఆర్ స్వతహాగా కాంగ్రెస్ నేత. ఆయన పలుమార్లు పీసీసీ చీఫ్ గా పని చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్క సారే గెలిచారు. తర్వాత ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఆయనకు పదవులు మాత్రం వస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం తర్వాత ... తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిపోవడం.. కాంగ్రెస్ బలహీనపడటంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు మంచి పదవి ఇచ్చి.. కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం పోగానే ఆయన పార్టీ మారిపోతున్నారు. కేశవరావు రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్.. కేకేను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. గులాబీ కండువా కప్పుకున్న అనంతరం రాజకీయ వ్యవహారాల్లో కేకేతో కలిసి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2018లో ప్రభుత్వం రద్దు.. అభ్యర్థుల ఎంపిక లాంటి వాటితోపాటు ప్రభుత్వ వ్యవహారాల్లో కేసీఆర్కు సలహాదారుగా కేకే వ్యవహరించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. ఆయనకు పార్టీలో అత్యున్నత పదవి కట్టబెట్టారు. కేకే కూతురు విజయలక్ష్మికి హైదరాబాద్ మేయర్ పదవి ఇచ్చారు. అయినప్పటికీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేకే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.కారు దిగాలని తండ్రీకూతురు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. కేకే తనయుడు విప్లవ్ మాత్రం పార్టీ మారేదేలే అని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని.. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని ప్రకటించారు. ఫైనల్గా కేకే నిర్ణయం బీఆర్ఎస్ వర్గాలను ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. ఇన్నాళ్లు పదవులు అనుభవించి.. అధికారం కోల్పోగానే పార్టీని వీడటం ఏమాత్రం నైతికత అనిపించుకోదని మండిపడుతున్నాయి.