YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కవిత విడుదల ఎప్పుడు

కవిత విడుదల ఎప్పుడు

హైదరాబాద్, ఏప్రిల్ 13
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గత నెలలో అరెస్టయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. మధ్యంతర బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆమెను పలు దఫాలుగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారించారు.. ఆమె విచారణకు సహకరించడం లేదని.. మరి కొద్ది రోజులు ఆమెను కస్టడీలోకి ఇవ్వాలని విజ్ఞప్తి కూడా చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆమెను 3 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ నెల 15 వరకూ ఆమెకు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ప్రతి రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకూ కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు కవితను కోర్టులో హాజరు పరచాలని న్యాయమూర్తి సీబీఐను ఆదేశించారు. దీంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ తన కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న కవితను గురువారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఆమెను శుక్రవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు హాజరు పరిచారు. లిక్కర్ కేసుకు సంబంధించి ఆమెను విచారించాల్సిన అవసరం ఉందని.. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని .. సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని.. విచారణకు ఆమె సహకరించడం లేదని.. అందుకే కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆమెను 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఇప్పటివరకు కవిత ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల విచారణలో ఉంది. ఇప్పుడు తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆమెను తమ అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవితను ఇటీవల తీహార్ జైల్లోనే సిబిఐ అధికారులు విచారించారు. లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ ఇటీవల అభియోగాలు మోపింది.. అంతేకాదు కవితకు ఆడిటర్ గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు వాట్సాప్ చాట్ పై దృష్టి పెట్టింది. 100 కోట్ల ముడుపుల చెల్లింపు తర్వాత భూములు కొనుగోలు చేశారని.. ఆ భూముల డాక్యుమెంట్లపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సిబిఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధానంగా వినిపించిన పేరు సౌత్ గ్రూప్.. ఆ సౌత్ గ్రూప్, ఆప్ కు మధ్యవర్తిగా కవిత వ్యవహరించారని.. 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో ముఖ్యపాత్ర పోషించారని సిబిఐ అధికారులు అభియోగాలు మోపారు. అవినీతి నిరోధక చట్టం కింద తాము కవితపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. ఐపిసి 120 బి కింద కుట్రకోణం లోనూ ఈ కేసు విచారణ సాగిస్తామని సిబిఐ అధికారులు అంటున్నారు. అందువల్లే తమ కవితను అరెస్టు చేసినట్టు సిబిఐ ప్రకటించింది. తాజా అరెస్ట్ నేపథ్యంలో కవితను జ్యూడిషియల్ కస్టడీ నుంచి సిబిఐ హెడ్ క్వార్టర్స్ కు తరలించింది. శుక్రవారం కోర్టు ఎదుట ప్రవేశపెట్టి.. సిబిఐ అధికారులు కవితను కస్టడీలోకి తీసుకుంటారు.ఇదే కేసులో కవితను విచారించినందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలని కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించిన పిటిషన్ పై విచారణ ఈనెల 16న జరగనుంది. ఇది ఇలా ఉండగానే కవితను సిబిఐ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఈ లిక్కర్ స్కాం లో కవితను మార్చి 15న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె తీహార్ జైల్లో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఆధీనంలో ఉన్నారు.

Related Posts