YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

త్రిముఖ పోటీలో అసమ్మతి కుంపట్లు...

త్రిముఖ పోటీలో అసమ్మతి కుంపట్లు...

నెల్లూరు, ఏప్రిల్ 22 
ఎన్నికల వేళ కూటమిలో అసమ్మతి కుంపట్లు కాక రేపుతూనే ఉన్నాయి. నామినేషన్ల పర్వం కొనసాగుతున్నా టిక్కెట్ల వేడి ఇంకా చల్లారడం లేదు. టిక్కెట్లు దక్కకపోవడంతో పలువురు నేతలు తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రత్యర్థుల సంగతి ఏమోగానీ.. స్వపక్షంలోనే విపక్షం తయారు కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూటమి అభ్యర్థులు. తాజాగా.. నెల్లూరు జిల్లా టీడీపీలో రెబల్స్ బెడద క్యాండేట్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇంతకీ.. నెల్లూరు జిల్లాలో రెబల్స్‌ బెడద ఎవరెవర్ని వెంటాడుతోంది.? రెబల్స్‌తో కూటమి నేతలు ఎలాంటి చర్చలు చేస్తున్నారు.?ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ఎవరికివారు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే.. నామినేషన్ల గడువు ముగింపు దశకు చేరుకుంటున్నా.. కూటమిలో మాత్రం కుంపట్లు చల్లారడం లేదు. దానికి తగ్గట్లే.. నెల్లూరు జిల్లా టీడీపీలో నేతల అసమ్మతి రోజురోజుకీ ముదురుతోంది. ప్రధానంగా.. కందుకూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కందుకూరు టిక్కెట్‌ టీడీపీ అధిష్టానం ఇంటూరి నాగేశ్వరరావుకి ఇవ్వగా.. అవకాశం దక్కకపోవడంతో ఇంటూరి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు టిక్కెట్‌ దక్కలేదనే కోపంతో రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఇంటూరి రాజేష్‌.. కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. అంతేకాదు.. కందుకూరులో టీడీపీని ఓడించి తీరుతానని రాజేష్‌ శపథం చేయడం ఆసక్తిగా మారుతోంది. టీడీపీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన కందుకూరు రెబల్ అభ్యర్థి రాజేష్‌కి స్థానికంగానూ మద్దతు పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత దివి శివరాం రాజేష్‌కు మద్దతు ప్రకటించడం ఆసక్తిగా మారింది. టీడీపీ అధిష్టానం టిక్కెట్‌ ఇచ్చిన ఇంటూరు నాగేశ్వరరావుకు మద్దతు ఇవ్వబోనని తేల్చి చెప్పారు శివరాం. రాజేష్ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. తమ కుటుంబాన్ని దూషించిన నాగేశ్వర్ రావుకు ఎట్టిపరిస్థితుల్లో మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు దివి శివరాం.మరోవైపు.. నెల్లూరు జిల్లా కావలిలోనూ రెబల్‌ రచ్చ ముదురుతోంది. కావలి టీడీపీ అభ్యర్థిగా కావ్య క్రిష్ణారెడ్డి బరిలో దిగుతుండగా.. బీజేపీ నేత పసుపులేటి సుధాకర్ రెబల్‌గా పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీని వీడి టీడీపీ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన.. చంద్రబాబు మోసం చేశారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు నిర్ణయం తీసుకున్నారు పసుపులేటి సుధాకర్‌. రేపు నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు.. జోరుగా ప్రచారం చేస్తున్న పసుపులేటి సుధాకర్‌ని టీడీపీ నేతలు బుజ్జగించినా ఫలితం దక్కలేదు. ఇదిచాలదన్నట్లు.. ఎన్నికల్లో పోటీ చేసి సత్తా ఏంటో చూపిస్తానన్నారు పసుపులేటి సుధాకర్‌. దాంతో.. కావలి టీడీపీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా.. నెల్లూరు జిల్లా కందుకూరు, కావలి నియోజకవర్గాల్లో రెబల్స్‌ బెడదతో కూటమి క్యాండేట్లు తలలు పట్టుకుంటున్నారు. అయితే.. కూటమి అగ్రనేతలు రంగంలోకి దిగి రెబల్స్‌ను బుజ్జగిస్తున్న నేపథ్యంలో.. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి విత్‌డ్రా చేసుకుంటారా?
లేదా అన్నది చూడాలి.

Related Posts