హైదరాబాద్, ఏప్రిల్ 23
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష -2024కు దరఖాస్తు గడువు ఏప్రిల్ 20తో ముగిసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి టెట్ పరీక్షల కోసం 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1కి 99,210 మంది దరఖాస్తు చేసుకోగా.. పేపర్-2కి 1,84,231 మంది దరఖాస్తులు సమర్పించారు. సబ్జెక్టులవారీగా పరిశీలిస్తే.. పేపర్-2లో మ్యాథమెటిక్స్, సైన్స్కు 99,974 మంది దరఖాస్తు చేసుకోగా.. సోషల్ స్టడీస్కు 86,454 దరఖాస్తులు వచ్చాయి.పేపర్- 1కు ఆదిలాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా 7,504 దరఖాస్తులు రాగా.. పేపర్- 2కు సంబంధించి నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా 9,162మంది దరఖాస్తులు వచ్చాయి. వాస్తవానికి ఏప్రిల్ 10తో గడువు ముగియాల్సి ఉండగా.. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఏప్రిల్ 9 సాయంత్రం నాటికి కేవలం టెట్కు 1,93,135 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంతో పోల్చితే దరఖాస్తులు భారీగా తగ్గడంతో ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గడువు పొడిగించడంతో 10 రోజుల్లో 90 వేల మంది అభ్యర్థులు అదనంగా దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తు గడువుతోపాటు దరఖాస్తుల సవరణ గడువు కూడా ఏప్రిల్ 20తో ముగిసింది. ఏప్రిల్ 11 నుంచి 20 వరకు దరఖాస్తులోని వివరాలను సవరించుకునేందుకు అవకాశం కల్పించగా.. పేపర్-1లో 6,626 మంది, పేపర్-2లో 11,428 మంది అభ్యర్థులు వివరాలను సరిచేసుకున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను మే 15 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం:
➥ టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు.
➥ పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.
TS TET 2024: 'టెట్' అభ్యర్థులకు షాకిచ్చిన రేవంత్ సర్కార్, ఫీజులు భారీగా పెంపు- సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ
ముఖ్యమైన తేదీలు..
➥ హాల్టికెట్ల డౌన్లోడ్: 15.05.2024 నుంచి.
➥ టెట్-2024 పరీక్ష తేదీలు: 20.05.2024 - 03.06.2024.
➥ పరీక్ష సమయం: ఉదయం 9 గం. - 11.30 గం. వరకు, మధ్యాహ్నం 2 గం.- సాయంత్రం 4.30 వరకు.
➥ టెట్-2024 ఫలితాల వెల్లడి: 12.06.2024.
జూన్ 20 వరకు డీఎస్సీ దరఖాస్తుకు అవకాశం..
తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2024 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభమైంది. డీఎస్సీకి ముందు టెట్ నిర్వహణ తప్పనిసరి అని కోర్టు ఆదేశించడంతో ఏప్రిల్ 2తో ముగియాల్సిన గడువును జూన్ 20 వరకు పొడిగించింది. ఇఖ జులై 17 నుంచి 31 వరకు టీఎస్ డీఎస్సీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా 37,700 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. దీంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 2.14 లక్షల మంది వరకు దరఖాస్తులు సమర్పించారు.