హైదరాబాద్
నిత్యం రౌడీ షీట్లను వెంటవేసుకొని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, ప్రస్తుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదిప్య రావు తెలిపారు. వెంగళరావు నగర్ లోని ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దానం వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మాగంటిపై దానం అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రౌడీ షీటర్లచే ఏర్పాటు చేయబడిన సభలో వారిచే సన్మానం చేసుకున్న దానం నాగేందర్ స్థానిక ఎమ్మెల్యే మాగంటి పై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నియోజకవర్గ మహిళలను అక్కచెల్లెలుగా భావించి ఇచ్చే బహుమతుల పట్ల సైతం విమర్శించడం యావత్ మహిళలను విమర్శించినట్టేనని అన్నారు.