YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చక్రం తిప్పిన చంద్రబాబు

చక్రం తిప్పిన చంద్రబాబు

విజయవాడ, ఏప్రిల్  25
ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఎన్డిఏ కూటమిలో అభ్యర్థుల ఎంపిక చిత్ర విచిత్రంగా జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుండడం విశేషం. 2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి మధ్య పొత్తు కుదిరినప్పుడు.. బిజెపికి కేటాయించిన స్థానాల్లో.. ఆ పార్టీకి చెందిన సీనియర్లే పోటీ చేసేవారు. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ మూలాలు ఉన్నవారు అభ్యర్థులుగా బరిలో దిగేవారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. పక్క పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఎటువంటి బిజెపి నేపథ్యం లేని వారు సైతం టిక్కెట్లు దక్కించుకున్నారు. చివరి నిమిషం వరకు అనపర్తి, దెందులూరు విషయంలో పెను తుఫాన్ నడిచింది. అనపర్తి బిజెపికి కేటాయించడం, ఆ సీటును టిడిపి ఇన్చార్జ్ ఆశిస్తుండడం.. అదే సమయంలో అనపర్తి బదులు దెందులూరు చర్చకు రావడం.. అక్కడ టిడిపి ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ ఉండడంతో జఠిలంగా మారుతుందని అంతా భావించారు. కానీ ఇక్కడ వివాదం టీ కప్పులో తుఫానుగా మిగిలింది. అయితే ఇదంతా చంద్రబాబు వాడిన సేఫ్ గేమ్ గా ప్రచారం జరుగుతోంది.దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ తో పాటు ఏపీ అసెంబ్లీకి సైతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఏపీలో మాత్రం నాలుగో విడత పోలింగ్ మే 13న జరగనుంది. అయితే ఎన్డీఏ మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియలో భాగంగానే నాలుగో విడత పోలింగ్ నకు చంద్రబాబు పావులు కదిపినట్లు వార్తలు వచ్చాయి. ఎన్డీఏలో ప్రధాన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. సహజంగానే సీట్ల కేటాయింపులో ఆ పార్టీపై ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా బీజేపీకి పది అసెంబ్లీ సీట్లు ఇవ్వాలన్న విషయంలో టిడిపిలో తీవ్ర తర్జనభర్జన జరిగింది. బిజెపికి కేటాయించిన సీట్లు టిడిపికి పట్టు ఉన్నవే. పైగా అక్కడ సీనియర్లు ఉన్నారు. ఈ తరుణంలో చంద్రబాబు పురందేశ్వరితో కీలక చర్చలు జరిపారు. అనపర్తిని బిజెపికి విడిచి పెట్టాలని పురందేశ్వరి కోరారు. అయితే ఆ సీటు సోము వీర్రాజు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు బదులు గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన శివరామకృష్ణంరాజుకు టికెట్ ఇచ్చారు. అయితే అప్పటికే టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును అధిష్టానం ప్రకటించి ఉంది. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. గత ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన వ్యక్తికి ఎలా టిక్కెట్ ఇస్తారని నల్లమిల్లి ప్రశ్నించేసరికి అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.బిజెపితో పాటు టిడిపి పై ముప్పేట ఒత్తిడి పెరిగింది. గెలిచిన సీటు కావడంతో ఆ రెండు పార్టీలు ఆలోచనలో పడ్డాయి. అనపర్తి బదులు దెందులూరు ఇస్తే తీసుకుంటామని బిజెపి ముందుకు వచ్చింది. దెందులూరు లో బిజెపికి సీనియర్ నేత గారపాటి చౌదరి ఉన్నారు. అయితే అక్కడ కూడా చింతమనేని ప్రభాకర్ రూపంలో బలమైన అభ్యర్థి టిడిపికి ఉన్నారు. పైగా ఈ రెండు సీట్లు బిజెపికి కేటాయిస్తే.. వైసిపి గెలిచే ఛాన్స్ ఉందని అంతర్గత సర్వేల్లో తేలింది. అదే జరిగితే ఓడిపోయిన సీట్లను చంద్రబాబు తమకు అంటగట్టారన్న అపవాదు పడుతుంది. అందుకే అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బిజెపిలోకి పంపించి ఆ పార్టీ అభ్యర్థిని చేశారు. చింతమనేని ప్రభాకర్ కు లైన్ క్లియర్ చేశారు. మొత్తానికైతే చంద్రబాబు ఆడిన సేఫ్ గేమ్ లో బిజెపి పావుగా మారిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
టీడీపీ నేతలే...కూటమి అభ్యర్ధులు
ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. సాధారణంగా అధికారపక్షం నుంచి విపక్షంలోకి.. విపక్షం నుంచి అధికారపక్షంలోకి వలసలు సాగుతుంటాయి. కానీ ఏపీలో విచిత్రంగా నేతల చేరికలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి కట్టిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 31 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలను వదులుకుంది. ఈ లెక్కన తాను వదులుకున్న స్థానాల్లో బిజెపి, జనసేన నేతలు పోటీ చేయాలి. కానీ ఆ రెండు పార్టీలకు సరైన అభ్యర్థులు లేరు. దీంతో రాత్రికి రాత్రే టిడిపి నేతలు ఆ రెండు పార్టీల్లో చేరుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా మారుతున్నారు. తాజాగా అనపర్తి టిడిపి ఇన్చార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిజెపిలో చేరి ఆ పార్టీ అభ్యర్థి కావడం విశేషం.అయితే టిడిపి నేతలకు కండువా కప్పి తన పార్టీ అభ్యర్థిగా తొలుతా ప్రకటించిన వారు మాత్రం పవన్ కళ్యాణే.భీమవరం మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత పులపర్తి ఆంజనేయులకు జనసేనలోకి రప్పించారు.జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. అది మొదలు చాలామంది టీడీపీ నాయకులకు జనసేనలోకి రప్పించి టికెట్లు కట్టబెట్టారు. ఈ సంస్కృతి బిజెపిలో సైతం కనిపిస్తుండడం విశేషం. దీని వెనుక చంద్రబాబు చతురత ఉంది. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోవడంతో టీడీపీలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. దానిని అధిగమించేందుకు చంద్రబాబు ఇలా ప్లాన్ చేసినట్లు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.మొన్న ఆ మధ్యన అవనిగడ్డకు చెందిన టిడిపి సీనియర్ నేత మండలి బుద్ధ ప్రసాద్ జనసేనలో చేరారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించారు. కానీ అక్కడ జనసేన నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి లేకుండా పోయారు. ఐవిఆర్ఎస్ సర్వేలో సైతం జనసేన నేతలకు సానుకూలత రాలేదు. దీంతో పవన్ పునరాలోచనలో పడ్డారు. మండలి బుద్ధ ప్రసాద్ ను జనసేనలోకి రప్పించి టికెట్ కేటాయించారు. పాలకొండలో కూడా సేమ్ సీన్. టిడిపి ఇన్చార్జిగా ఉన్న నిమ్మక జయకృష్ణను జనసేనలోకి రప్పించి టికెట్ కేటాయించారు.ఇప్పుడు బిజెపి ఆ పరిస్థితికి వచ్చింది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి అనపర్తి సీటు కేటాయించారు. అక్కడ బిజెపి అభ్యర్థిని సైతం ప్రకటించింది.కానీ ఆ నియోజకవర్గంలో టిడిపి బలంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ తీరుపై ఆగ్రహం చెందారు. అదే సమయంలో బిజెపి ప్రకటించిన అభ్యర్థిపై అనుమానాలు ఉన్నాయి. అక్కడ ఆయన వైసీపీ అభ్యర్థి పై నెగ్గుకు రాలేరని ప్రచారం బలంగా జరిగింది. దీంతో అక్కడ బిజెపి ఒక ఆలోచనకు వచ్చింది.నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బిజెపిలోకి రప్పించి టికెట్ కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో ఆయన విజయవాడబిజెపి కార్యాలయానికి వెళ్లి కండువా మార్చుకున్నారు. అనపర్తి బిజెపి అభ్యర్థిగా మారిపోయారు. పేరుకే పొత్తు కానీ, పేరుకే సీట్ల కేటాయింపు కానీ.. బిజెపి, జనసేనకు కేటాయించిన సీట్లలో టిడిపి నేతలే పోటీ చేస్తుండడం గమనార్హం.

Related Posts