హైదరాబాద్, ఏప్రిల్ 25
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్)' ఏప్రిల్ 27 లేదా మే 1న వెలువడే అవకాశం ఉంది. అదేసమయంలో 'దోస్త్' ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఏప్రిల్ 24న ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో.. ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశ షెడ్యూలు ప్రకటించడానికి సన్నాహాలు చేస్తోంది. దోస్త్ పరిధిలో రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్ దోస్త్ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.