హైదరాబాద్, ఏప్రిల్ 29
తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 30న) వెలువడనున్నాయి. ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదలచేయనున్నారు. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 2,57,952 మంది; బాలికలు 2,50,433 మంది ఉన్నారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in తోపాటు వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచనున్నారు.
రాష్ట్రంలో 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియను అధికారులు చేపట్టారు. టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 20తో ముగిసింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫలితాలను డీకోడింగ్ ప్రక్రియ పూర్తవడంతో ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా మంత్రులుకాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు.
ఈసారి ముందుగానే ఫలితాలు..
గతేడాది తెలంగాణలో ఏప్రిల్ 3 ఏప్రిల్ 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను మే 10న విడుదల చేశారు. అయితే ఈ సారి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో.. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించారు. గతేడాది ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పట్టింది. ఈసారి కూడా 27 వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించనున్నారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు తొందరగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
➥ విద్యార్థులు ఫలితాల కోసం మొదట BSE Telangana అధికారిక సైట్ని సందర్శించాలి-https://bse.telangana.gov.in/
➥ హోమ్పేజీలో అందుబాటులో 'TS SSC Results 2024' లింక్పై క్లిక్ చేయాలి.
➥ విద్యార్థులు తమ హాల్టికెట్ నెంబరు నమోదు చేసి, 'Submit' బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ విద్యార్థులకు సంబంధించిన ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
➥ ఆ తర్వాత దానిని డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్ - 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?
సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. వారంరోజుల్లో ఫలితాల వెల్లడికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఏర్పాట్లు చేస్తోంది. మే మొదటి వారంలో పరీక్షల ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే ఫలితాల వెల్లడి కచ్చితమైన తేదీని, సమయాన్ని మాత్రం సీబీఎస్ఈ అధికారికంగా ప్రకటించలేదు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదోతరగతి పరీక్షలు; ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి పరీక్షలును సీబీఎస్ఈ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 38 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో పదోతరగతి పరీక్షలకు 22 లక్షలకుపైగా, 12వ తరగతి పరీక్షలకు దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.