హైదరాబాద్
దేశంలో బిజెపి పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే , ఎస్సీ, ఎస్టి, బిసి, మైనార్టీలకు తిప్పలు తప్పవని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీరామ్ నగర్ లో ఆయన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధిని మరచి నేరగాళ్ల అభివృద్ధిని ఆయన ఆకాంక్షించారని మండిపడ్డారు. రౌడీ షీటర్ల ను పెంచి పోషించి తన వ్యతిరేకులపై దాడి చేయించిన దుర్మార్గుడు మాగంటి గోపీనాథ్ అని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం కలిగినదని, ఈ పార్టీలో అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుందని ఆయన అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే జూబ్లీహిల్స్ ప్రాంతంలో మన ఎమ్మెల్యే లేని లోటును తీరుస్తానని మాట ఇచ్చారు. బిజెపి మాటలు ప్రజలు పట్టించుకోవద్దని, వారు కుల మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుచూపు కలిగిన నేత అని ప్రతి ఒక్కరిను అభివృద్ధి చేసి తీరుతాడని హామీ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ కు ఏం చేశారు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు.