YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హోరెత్తుతున్న ప్రచారం

హోరెత్తుతున్న ప్రచారం

హైదరాబాద్, మే 7,
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. ఇక మిగిలింది ఐదు రోజులే కావడంతో ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీల ఢిల్లీ నేతలు తెలంగాణ గల్లీలకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించిన బిజెపి, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు ఆదివారం నుంచి విస్తృతంగా పర్యటించేలా ప్రణాళికలు ఖరారు చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఆయా పార్టీల కీలకనేతలందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.బిజెపి తరపున ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యకుడు జెపి నడ్డా, కాంగ్రెస్ తరపున రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తారని ఆయా పార్టీల నేతలు తెలిపారు. మరో వైపు రాష్ట్రంలో కీలకమైన బిఆర్‌ఎస్ తరపున ఆ పార్టీ అధినేత కెసిఆర్ కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.  ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి అందుకు తగినట్టుగా తెలంగాణలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తోంది. బిజెపి తరపున ఆ పార్టీ జాతీయ నేతలు నెల రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఇతర అగ్రనేతలు పలుమార్లు రాష్ట్రానికి వచ్చారు. పోలింగ్‌కు ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకు మరోమారు ముందుకు వస్తున్నారు.ప్రధాని మోడీ ఈనెల 8, 10 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. నేడు అమిత్‌షా, ఆరో తేదీన జేపీ నడ్డాలు రాష్ట్రానికి వస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరిల్లో అమిత్ షా, పెద్దపల్లి, భువనగిరి, నల్లగొండలో నడ్డా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు.కాంగ్రెస్ నుంచి అతిరథ మహారథులు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న తరుణంలో రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ప్రచార బరిలోకి దిగుతున్నారు. నిజానికి ఈ ఎన్నికల్లో తెలంగాణలో ప్రియాంకగాంధీ కేంద్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని, వీలైనన్ని ఎక్కువసార్లు ఆమెను ప్రచారానికి తీసుకురావాలని టిపిసిసి భావించింది. కానీ, ఇతర రాష్ట్రాల ప్రచార షెడ్యూల్ కారణంగా అది సాధ్యం కాలేదు. 10వ తేదీ వరకు రాహుల్‌గాంధీ, ప్రియాంకలు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా సభలు, రోడ్ షోలలో పాల్గొంటారు. నాంధేడ్ నుంచి నేరుగా నిర్మల్‌లో జరుగనున్న ఎన్నికల ప్రచార సభకు రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. అక్కడ అదిలాబాద్ అభ్యర్ధి ఆత్రం సుగుణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆ తరువాత అక్కడి నుంచి నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని అలంపూర్, ఎర్రవల్లి కూడలి వద్ద జరురగనున్న ఎన్నికల ప్రచార సభకు సాయంత్రం 5 గంటలకు రాహుల్‌గాంధీ హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 9వ తేదీన ఉదయం కరీంనగర్, సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్‌లోనూ రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.గాంధీ రాష్ట్ర పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో తెలంగాణకు రావాల్సిన ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈ నెల 10వ తేదీన ఎల్లారెడ్డి, తాండూర్, షాద్‌నగర్‌లలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. వీరితోపాటు ఏఐసిఅధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఎన్నికల ప్రచారానికి హాజరవుతారని టిపిసిసి వర్గాలు తెలిపాయి.బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సైతం ఎన్నికల ప్రచారంలో ముందుకెళుతున్నారు. గతంలో రూపొందించిన షెడ్యూల్‌కు అనుగుణంగానే ఈ నెల 10వ తేదీ వరకు కెసిఆర్ బస్సుయాత్ర ఉంటుందని బిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ఈనెల 10వ తేదీన సిరిసిల్లలో రోడ్ షో, సిద్ధిపేటలో బహిరంగ సభతో ఆయన లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగుస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రచారానికి వడదెబ్బ
తెలంగాణలో బడా నాయకుల సభలకు ప్రజలను తీసుకు రావడం ఇప్పుడు చాలా పార్టీలకు కష్టమైపోయింది. దాంతో అనేక సభలను, రోడ్ షోలను  తగ్గించేసుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయమే ఉంది. ఎండలు ఇటు తెలంగాణలోనూ,అటు ఆంధ్రలోనూ రాజకీయ పార్టీల ప్రచారానికి పెద్ద అడ్ఢంకిగా తయారయ్యాయి. ఆంధ్రలోనైతే అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్ కూడా దాటుతోంది. వడ దెబ్బకి ఇరు రాష్ట్రాలలో అనేక మంది చనిపోయారు కూడా. వచ్చే వారం అయితే ఎండలు మరింత తీవ్రం కానున్నాయి.మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు ప్రజలు బయట తిరగొద్దని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 తర్వాత నుంచి సాయంత్రం 5.00 వరకు ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. నంద్యాల జిల్లాలో శుక్రవారం ఉష్ణోగ్రత 47.7 డిగ్రీల సెల్సియస్ దాటింది. ప్రకాశం, కడప జిల్లాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి.తెలంగాణలో కూడా గరిష్ఠంగా 42 డిగ్రీల సెల్సియస్ ఎండలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 3 నుంచి 4 పబ్లిక్ మీటింగ్ లలో ప్రసంగిస్తున్నారు. ఆయన తన ఆరోగ్యం గురించి  కూడా పట్టించుకోవడం లేదనే చెప్పాలి. ఆయన హెలికాప్టర్ ద్వారా ఆయా నియోజకవర్గాలకు సమయానికి చేరకుంటున్నారు.బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అయితే చాలా వరకు సాయంత్రం దాటాకే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆయన బస్సు యాత్ర ద్వారా రోజుకు ఒకటి లేక రెండు పబ్లిక్ మీటింగ్ లలో ప్రసంగిస్తున్నారు. బిజెపి చెవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయితే ఇటీవల తాండూర్ సెగ్మెంట్ లో ప్రచారం చేస్తూ డీహైడ్రేషన్ కు గురయ్యాడు. ఇప్పుడాయన ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను త్రాగు నీటితో కలుపుకుని ప్రచారం చేస్తున్నాడు. అసదుద్దీన్, అక్బరుద్దీన్, మాధవీలత అయితే పొద్దున, సాయంత్రం అన్న తేడా లేకుండా ప్రచారం చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే రోజుకు రెండు మూడు జిల్లాల్లో బస్సు యాత్ర కొనసాగిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆయన రోడ్ షోకు జనం కూడా బాగానే వస్తున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అయితే హెలికాప్టర్ లో తిరుగుతూ రోజుకు రెండు మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.

Related Posts