
వరంగల్, ఫిబ్రవరి 15,
తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోందా? బీఆర్ఎస్ టార్గెట్ గా ఇప్పటి నుంచి అడుగులు వేస్తోందా? సమయం, సందర్భం వచ్చిన బీఆర్ఎస్ పార్టీపై మాటల దాడిని పెంచిందా? తెలంగాణ అప్పల కుప్పగా మారిందని ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఎందుకన్నారు? రేవంత్ సర్కార్ ఏడాదిగా ఇదే విషయాన్ని చెబుతోందా? ఇప్పుడు లెక్కలతో సైతం బయటపెట్టడంతో ఆ పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తోంది.రాష్ట్రాన్ని పదేళ్లు బీఆర్ఎస్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చిందని రేవంత్ సర్కార్ పదేపదే చెబుతోంది. అవన్నీ రాజకీయ విమర్శలుగా కారు నేతలు చెప్పడం మొదలుపెట్టారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులుగా ఉండేది తెలంగాణ. గడిచిన పదేళ్లలో ఖజానాను ఖాళీ చేసింది కేసీఆర్ సర్కార్. ఈ విషయాన్ని అధికార పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు.వారు చేసిన అప్పులకు ప్రతీ నెలా వడ్డీ వేల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టులు కట్టామని, దానివల్లే తెలంగాణలో రైస్ అధికంగా పడుతోందంటూ కారు పార్టీ నేతలు మీడియా ముందు ఒకటే రీసౌండ్. బీఆర్ఎస్ అధికారం పోయిన తర్వాత ప్రాజెక్టు కుంగడం, వేల కోట్ల రూపాయలతో నిర్మించిన సచివాలయం పెచ్చులు ఊడడం మొదలైంది. దీంతో ఏం జరిగిందని తెలుసుకునేందుకు తెలంగాణ ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు.బడ్జెట్ సందర్భంగా రాజ్యసభలో చర్చ జరిగింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ గురించి కీలక విషయాలు వెల్లడించారు. విభజన తర్వాత మిగులు బడ్జెట్ రాష్ట్రంగా వున్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని చెప్పుకొచ్చారు. విభజన చట్టం కింద ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రియాక్ట్ అయ్యారు.గడచిన పదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఏమేమి చేసిందనేది వివరించారు.మెదక్లో తొలిసారి రైల్వేస్టేషన్, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, నిజామాబాద్లో పసుపు బోర్డును కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. జహీరాబాద్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు, బీబీనగర్లో ఎయిమ్స్ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. భారత్ మాల ప్రాజెక్టు క్రింద నాలుగు గ్రీన్ కారిడార్లను తెలంగాణలో ఏర్పాటు చేశామని వివరించారు మంత్రి నిర్మల. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను రికార్డు స్థాయిలో మంజూరు చేశామన్నారు. ఐదు వందే భారత్ రైళ్లను తెలంగాణలో ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు మొత్తం రూ. 2700 కోట్లు మంజూరు చేశామన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎక్కడంటూ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. మంత్రి నిర్మల మాటలన్నీ బీఆర్ఎస్ కే తగిలాయని అంటున్నారు అధికార పార్టీ నేతలు. మిగులు తెలంగాణను బీఆర్ఎస్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చిందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి బీజేపీ సందర్భాన్ని బట్టి బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పువచ్చు.