
హైదరాబాద్, జూన్ 11,
తెలంగాణ క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో శాఖల కేటాయింపు చర్చనీయాంశంగా మారింది. మంత్రుల శాఖల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులు హస్తినలో మకాం వేసి పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు సందర్భంగా పాత మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నారట. కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయిన సీఎం రేవంత్..కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు పాత మంత్రుల శాఖల పనితీరుపై కూడా అధిష్టానంతో చర్చించారట.ఏడాదిన్నర క్రితం మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన మంత్రుల్లో కొందరి పనితీరు సరిగ్గా లేదనే చర్చ జరిగిందట. సిట్టింగ్ మంత్రుల పనితీరు, అవినీతి ఆరోపణలపై ఆరా తీసిన రాహుల్ గాంధీ.. శాఖల మార్పులు, చేర్పులపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నేరుగా రాహుల్ గాంధీ మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్, వాళ్ల మీద వచ్చిన అలిగేషన్స్ మీద ఫోకస్ పెట్టడంతో శాఖల పునః ప్రక్షాళన ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఇక మరికొందరు మంత్రులకు రెండు, మూడు కీలకమైన శాఖలు కూడా ఉన్నాయి. వీటి విషయంలో సమీక్ష చేయాలని నిర్ణయించారట.ఇక సీఎం రేవంత్రెడ్డి దగ్గర కూడా కొన్ని కీలక శాఖలున్నాయి. ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్, విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గనులశాఖ, స్పోర్ట్స్, యువజన సర్వీసులు, కార్మికశాఖ, న్యాయశాఖ, పశుసంవర్దకశాఖలు ఉన్నాయి. వీటిలో విద్యాశాఖ విషయంలో సీఎం గతంలోనే క్లారిటీ ఇచ్చారు. విద్యాశాఖను పూర్తిగా తన దగ్గరే పెట్టుకొని ప్రక్షాళన చేస్తానని స్పష్టం చేశారు.ఇక మూసీ ప్రక్షాళన, ఆక్రమణల తొలగింపు కోసం ఏర్పాటు చేసిన హైడ్రా వంటి వాటినీ తానే పర్యవేక్షించాలని కూడా సీఎం అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో తన దగ్గరున్న మున్సిపల్ శాఖను కూడా సీఎం ఎవరికి ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఇక మిగతా శాఖలను కొత్త మంత్రులకు ఇచ్చే అవకాశం ఉంది.అలాగే పాత మంత్రుల దగ్గరున్న శాఖల్లో కూడా కోత విధించి కొత్త వారికి ఇస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో మంత్రులు శాఖల మార్పులు పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది. సీయంతో పాటు డిప్యూటీ సీయం భట్టి, కీలక శాఖలు పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోధర రాజనర్సింహల శాఖలు కూడా మారనున్నాయనే టాక్ నడుస్తోంది. అటు రెండు శాఖలను పర్యవేక్షిస్తున్న కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి శాఖల్లోనూ మార్పులు తప్పవని తెలుస్తోంది.
మొత్తానికి మంత్రుల శాఖల కేటాయింపు తెలంగాణ పాలిటిక్స్లో ఆసక్తికరంగా మారింది. పాత మంత్రుల శాఖల్లో ఎవరెరికి కోతలు పడుతాయనేది.. కొత్త వారికి కేటాయించే శాఖలు ఏమిటనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అయితే సీయం రేవంత్ తో రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ లు శాఖల్లో మార్పులు చేర్పులపై కీలక చర్చలు జరిపిన తర్వాత… మంత్రి ఉత్తమ్ ను డిల్లీకి అధిష్టానం పిలవడం ఆసక్తిరేపుతోంది. ఒకరిద్దరు మంత్రుల శాఖలు మినహా దాదాపు అందరి శాఖల్లోనూ మార్పులు తప్పకపోవచ్చని తెలుస్తోంది.