
హైదరాబాద్, జూన్ 12,
ముగ్గురు తెలంగాణ కొత్త మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, న్యాయ, క్రీడల శాఖను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, కమర్షియల్ టాక్స్ శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్షణ్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను ఇచ్చారు. పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఏ క్షణంలో అయినా అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. హైకమాండ్ తో సుదీర్ఘ చర్చల తర్వాత ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. వెంటనే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో సమావేశమయ్యారు. తన వద్ద ఉన్న పదకొండు శాఖల్లో కొన్నింటిని కొత్త మంత్రులకు కేటాయించే ప్రక్రియను పూర్తి చేశారు. సీఎం రేవంత్ వద్ద హోం, మున్సిపల్, విద్య వంటి కీలకమైన శాఖలు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి వాటిని కొత్త మంత్రులకు కూడా కేటాయించలేదు. సీనియర్లలో కొంత మంది ఆ శాఖలు తమకు కేటాయించేలా ఆదేశించాలని హైకమండ్ వద్ద లాబీయింగ్ చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. రేవంత్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. భట్టి విక్రమార్కతోనూ హైకమాండ్ సంప్రదింపులు జరిపిందని అనుకున్నారు. వారు ప్రధానంగా తమకు హోంశాఖ ను కేటాయించేలా ఒత్తిడి చేశారని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం హోంశాఖను తన వద్దనే అట్టి పెట్టుకున్నారు. అంతే కాదు.. మున్సిపల్ శాఖ, విద్యా శాఖను కూడా ఇతర మంత్రులకు కేటాయించలేదు. ఇప్పటికీ కేబినెట్ లో మూడు ఖాళీగా ఉన్నాయి. ఒక వేళ ఆ మూడు స్థానాలను భర్తీ చేస్తే.. పదవులు పొందేవారికి అత్యంత కీలక శాఖలు లభిస్తాయని అనుకోవచ్చు. హైకమాండ్ తో చర్చలు , ఇతర సమీకరణాలను చూసుకుని రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలు కేటాయించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఎడ్యుకేషన్, హోం, మున్సిపల్ వంటి కీలకమైన శాఖలకు ప్రత్య్యేకంగా మంత్రి లేకపోవడం వల్ల పాలనపై ప్రభావం పడుతోందని వస్తున్న విమర్శలను రేవంత్ పట్టించుకోలేదు. ఆ శాఖలను కూడా తానే చూసుకోవాలని డిసైడయ్యారు. సీనియర్ల ప్రయత్నాలను రేవంత్ విజయవంతంగా నిలిపివేశారని.. ప్రభుత్వంలో మరో పవర్ సెంటర్ అయ్యేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారని అంటున్నారు. నేడో రేపో.. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులతో పాటు క్యాడర్ ఆశిస్తున్న కీలకమైన కార్పొరేషన్ల పదవుల పేర్లను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. వీటిపైనా ఢిల్లీలో రేవంత్ కసరత్తు చేసి హైకమాండ్ కు జాబితా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.