
హైదరాబాద్, జూన్ 12,
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను పార్టీలో ఎవరూ దరి చేరనివ్వడం లేదు. ఆమెను ఒంటరి చేసినట్లే కనపడుతుంది. ఈ నెల 4వ తేదీన ఇందిరాపార్కువద్ద మహా ధర్నా చేశారు. అదీ కూడా కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందని ఆమె ధర్నాకు దిగారు. తెలంగాణ జాగృతి తరుపున కల్వకుంట్ల కవిత ధర్నాకు దిగారు. అంత వరకూ ఓకే. గతంలో కవిత ఏ కార్యక్రమం చేసినా బీఆర్ఎస్ లోని ముఖ్యమైన నేతలందరూ హాజరయ్యేవారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి మొన్నటి వరకూ కవిత జాగృతి తరుపున తలపెట్టిన కార్యక్రమానికి నేతలందరూ హాజరై ఆమెకు అండగా నిలిచేవారు. కాని కట్ చేస్తే.. ఇప్పుడు సీన్ మారింది. కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ కు ఘాటుగా లేఖ రాయడం, బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తున్నారని ఆఫ్ ది రికార్డులో అన్న మాటలతో నాయకత్వం కూడా ఆమెకు దూరమయింది... కల్వకుంట్ల కవిత కూడా తాను ఒంటరిగానే ప్రయాణం చేసేందుకు సిద్ధమయినట్లు కనపడుతుంది. తెలంగాణ జాగృతి సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు తనకు కేసీఆర్ ఒక్కరే నాయకుడని చెప్పడం, జాగృతి తరుపున అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసుకుంటూ వెళుతుండటం కొంత ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా తన సోదరుడు కేటీఆర్ పై ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలతో కుటుంబానికి కూడా ఆమె దూరమయినట్లే కనిపిస్తుంది. ఆమె తన సోదరుడికి దూరం కావాలనే ఈ కామెంట్స్ చేశారు. దీంతో తెలంగాణ జాగృతి నిర్వహించే కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు ఎవరూ హాజరు కావద్దంటూ అధినాయకత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయట. అటు వైపు రాకుండా... అందుకే కవిత ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన ధర్నాకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ అటు వైపు చూడలేదు. బీఆర్ఎస్ లో ఉన్న మహిళా నాయకులు, మాజీ మంత్రులు కూడా రాకపోవడంతో కారు పార్టీ నేతలు కవితకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండటంతో పాటు కేసీఆర్ ఆదేశాలతోనే కవిత కార్యక్రమానికి నేతలు ఎవరూ హాజరు కాలేదని తెలిసింది. దీన్ని బట్టి చూస్తుంటే కవితకు కారు పార్టీ నుంచి సహకారం ఇక భవిష్యత్ లోనూ అందే అవకాశాలు కనిపించడం లేదు. అదే సమయంలో ఆమెను బీఆర్ఎస్ లో ఒంటరి చేసే ప్రయత్నం ముమ్మరం అయిందని చెప్పాలి. మరి రానున్న కాలంలో అన్నాచెల్లెళ్ల మధ్య వైరం ఏ స్థాయికి వెళుతుందన్నది చూడాలి.