
తిరుమల, జూన్ 14,
తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ప్రతి ఏడాది స్వామి వారిని దర్శించుకునే వారు ఉంటారు. రోజుకు గరిష్టంగా లక్షలాదిమంది.. కనిష్టంగా వేలాది మంది భక్తులు తిరుమల వస్తుంటారు. వారికి దర్శనాలు కల్పించడంతోపాటు నియంత్రించడం టిటిడి కి కష్ట సాధ్యం అవుతుంది. పటిష్టమైన చర్యలు చేపడుతున్న ఎక్కడో చోట లోపాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో క్యూ లైన్లోకి మించి బయటకు భక్తులు వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే గంటలపాటు కాంప్లెక్స్ లలో భక్తులు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇటువంటి తరుణంలో వినూత్న ఆలోచన చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులు క్యూ లైన్ లలో ఉండగానే స్వామి వారి దర్శన భాగ్యం కల్పించేందుకు నిర్ణయించింది.సాధారణంగా తిరుమల వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి కొన్నిసార్లు 12 గంటల సమయం పడుతుంది. ఆ సమయంలో భక్తుల బాధలు వర్ణనాతీతం. టీటీడీ( పరంగా మంచినీరు, మజ్జిగ వంటి సదుపాయాలు అందిస్తోంది. కానీ క్యూలైన్లలో భక్తులు ఉన్నప్పుడు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అటువంటి సమయంలో స్వామివారి దర్శనానికి వీలుగా ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇటీవల చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి టీటీడీ ఈవో శ్యామలరావు కార్యాచరణను వేగవంతం చేశారు. ముఖ్యంగా భక్తులు వేచి ఉండే కంపార్ట్మెంట్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారుఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కెమెరాలు ద్వారా తిరుమల వచ్చే భక్తుల రద్దీ ని అంచనా వేయనున్నారు టీటీడీ అధికారులు. తద్వారా భక్తులకు దర్శన సమయాన్ని నిర్దిష్టంగా ఇవ్వనున్నారు. ప్రస్తుతం గంటకు ఎంతమంది శ్రీవారిని దర్శించుకుంటున్నారనే సమాచారం టిటిడి వద్ద లేదు. ఆ వివరాలు అందుబాటులోకి వస్తే దళారులు, కొందరు ఉద్యోగుల సహకారంతో ఇష్టారాజ్యంగా క్యూ లైన్లోకి వచ్చే సంస్కృతికి బ్రేక్ పడుతుంది. జియో సంస్థ ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేషియల్ రికగ్నిషన్ ను ఉపయోగించి భక్తుల మొక్క చిత్రాలు నమోదు చేస్తుంది. తద్వారా గంటల వ్యవధిలోనే తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకునే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించారు టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు.