
హైదరాబాద్, జూన్ 14
అధికారం కోసం రాజకీయ పార్టీలు ఏమైనా చేస్తాయి. ఎలాంటి పనులకైనా పాల్పడుతుంటాయి. ఎందుకంటే అధికారం అనేది మత్తు లాంటిది. అధికారమనేది మంత్రదండం లాంటిది. దాని వల్ల వెనకేసుకోవచ్చు.. దాచుకోవచ్చు.. గిట్టని వాళ్లను పాదాల కింద తొక్కవచ్చు. అందువల్లే రాజకీయ నాయకులు అధికారం కోసం అర్రులు చాస్తూ ఉంటారు. వెనకటి కాలంలో అధికారం కోసం రాజకీయ నాయకులు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించేవారు. కార్యకర్తలతో మంతనాలు జరిపేవారు. పై స్థాయి నాయకులతో భేటీలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు రాజకీయాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది కదా. రాజకీయాలు చేసే తీరు పూర్తిగా వేరే తీరు సంతరించుకుంది కదా. అందువల్లే రాజకీయ నాయకులు తమ సిద్ధాంతాలను మార్చేసుకున్నారు. తమ వ్యూహాలకు వేరే విధంగా పదును పెట్టుకున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు మరింతగా మారిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రజలతో సంబంధాలు నెరిపే కంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ జాబితాలో ఈ నాయకుడు ఆ నాయకుడు అని తేడా లేదు.. అందరూ అలానే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తుకురారు. కేవలం వారి సొంత ప్రయోజనాలు మాత్రమే నాయకులకు గుర్తుకు వస్తుంటాయి. అధికారం దూరమైతే వారికి ప్రజలు గుర్తుకు వస్తుంటారు. ముందుగానే చెప్పినట్టు ఈ కాలంలో సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిపోయింది.. సోషల్ మీడియా లేకుంటే రాజకీయ నాయకులకు నిమిషం కూడా గడవలేని పరిస్థితి నెలకొంది. అందువల్లే వారు సోషల్ మీడియాలో తమ కిరాయి సైన్యంతో రకరకాల ప్రచారాలు చేయిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి ఏదో జరిగిపోతుందని.. ప్రజలు మొత్తం తీవ్రమైన దుఃఖంలో ఉన్నారని.. విపరీతమైన కష్టంలో ఉన్నారని.. ఈ సమయంలో తమ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆ రాజకీయ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో పెడ బొబ్బలు పెడుతున్నారు. అంతేకాదు తమ సోషల్ మీడియా సైన్యంతో రకరకాల వీడియోలు రూపొందించి పోస్ట్ చేస్తున్నారు.. వాస్తవానికి ప్రజలు తిరస్కరిస్తేనే కదా అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది.. మరి ఆ మాత్రం సోయి ఆ రాజకీయ పార్టీల నాయకులకు ఎందుకు లేకుండా పోయింది.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు.. ఏ విధంగా హింసించారు అనేది ఆ నాయకులకు గుర్తుకు రాదా.. పోనీ గుర్తుకు ఉండదా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియోను కొంతమంది తెగ సర్కులేట్ చేస్తున్నారు. ఆ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కెసిఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. గతంలో వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు.. భాయీ భాయీ అన్నట్టుగా తిరిగేవారు. అంతేకాదు ఒకరికి ఒకరు సహాయం కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ మళ్లీ అధికారంలోకి రావాలని.. వారిద్దరి కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయని కొంతమంది గతంలో ఉన్న దృశ్యాలను వీడియోలుగా రూపొందించి సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు. అంతేకాదు వీరిద్దరూ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా రావాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.. వాస్తవానికి ఈ మాటలు అంటున్నది ప్రజలు కాదు.. సామాన్యులు అంతకన్నా కాదు. కేవలం ఈ పార్టీల పెయిడ్ సోషల్ మీడియా గ్రూపులు.. ముందుగానే చెప్పినట్టు ప్రజలతో సంబంధాలను పెంచుకోవడానికి నేటి కాలంలో రాజకీయ నాయకులు ఇష్టం చూపించడం లేదు. ఆసక్తిని ప్రదర్శించడం లేదు. కోటలాటి గృహాలలో ఉండుకుంటూ… ఇనుప కాంచన నిర్మించుకుంటూ అందులో నివసిస్తున్నారు. అలాంటి వారికి అధికారాన్ని తిరిగి తెప్పించడానికి కొంతమంది సోషల్ మీడియాలో గంగ వెర్రులు ఎత్తుతున్నారు. లేనిపోని ప్రచారం చేసి ఏదో జరిగిపోతుంది అనే భ్రమ కల్పిస్తున్నారు.