YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గద్గర్ అవార్డ్స్ లో గద్దర్ మిస్సింగ్

గద్గర్ అవార్డ్స్ లో గద్దర్ మిస్సింగ్

హైదరాబాద్, జూన్ 14, 
ఏం చేసినా వివాదమే.. ఏదో ఒక లోపమే.. సోషల్ మీడియాలో రభస అవుతున్నది. ప్రధాన మీడియా దెప్పి పొడుస్తోంది. అయినప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. చివరికి ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా ఉండడం లేదు.. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. ప్రభుత్వ వైఫల్యమా? విపరీతమైన నిర్లక్ష్యమా? అనేది అంతు పట్టడం లేదు .
అప్పుడెప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంది అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఆ పురస్కారాలను ఇచ్చింది లేదు. కెసిఆర్ ప్రభుత్వం మొత్తానికే ఆ అవార్డులను కోల్డ్ స్టోరేజ్ లో పడేసింది. దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం తరఫున అవార్డులు ఇచ్చింది లేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి పురస్కారాలు అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో వాగ్గేయకారుడుగా.. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన గద్దర్ స్మృత్యర్థం అవార్డును ప్రకటించారు రేవంత్ రెడ్డి. గద్దర్ పేరు మీద ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ నటినటులకు, సాంకేతిక నిపుణులకు, ఇతర బృందాలకు పురస్కారాలను అందిస్తామని వెల్లడించారు. అంతేకాదు అవార్డుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సినీ నటి జయసుధ, ప్రఖ్యాత నిర్మాత దిల్ రాజులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీనటులు, ఇతర సాంకేతిక బృందాలకు అవార్డులను ప్రకటించింది ప్రభుత్వం. శనివారం అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వం చేసిన తప్పు వివాదంగా మారింది. సోషల్ మీడియాలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించి ముద్రించిన ఆహ్వాన పత్రికలో రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు ఫోటోలను మాత్రమే ప్రచురించారు. గద్దర్ అవార్డుకు సంబంధించిన ప్రతిమను కూడా అందులో ప్రముఖంగా చూపించారు. అయితే టీజీఎఫ్ఏ పేరుమీద ఈ ఆహ్వాన పత్రికను ముద్రించారు. అయితే ఈ ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటోను ముద్రించడం మర్చిపోయినట్టున్నారు. ఆహ్వాన పత్రిక ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో వివాదం మొదలైంది. అసలే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి.. బజార్లో నిలబెట్టడానికి భారత రాష్ట్ర సమితి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈలోగా ఈ ఆహ్వాన పత్రిక విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో భారత రాష్ట్ర సమితి నెగిటివ్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది.. ఇన్నేళ్లపాటు అవార్డులు ఎందుకు ఇవ్వలేదు? అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి… అధికారంలో ఉన్నప్పుడు గద్దర్ కు అపాయింట్మెంట్ ఇవ్వని విషయాన్ని పక్కనపెట్టి.. రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది.అయితే ఇంత జరుగుతున్నప్పటికీ.. ఇంతలా నెగటివ్ ప్రచారం చోటు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం తరఫునుంచి ఇంతవరకు ఒక్కరు కూడా మాట్లాడలేదు. అఫ్ కోర్స్ ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా.. ఏ స్థాయిలో విమర్శలు చేసినా.. కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన ఉండటం లేదు. ఆ పార్టీలో అధికార ప్రతినిధులు ఉన్నామంటే ఉన్నారు. పదవుల కోసం పైరవీలు చేయడం తప్ప.. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప.. వారు పార్టీ కోసం చేస్తున్నది ఏమీ లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక ఎప్పటి లాగానే భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. యధావిధిగా కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్దంగా ఉండిపోతుంది. పాపం చేసింది కూడా చెప్పుకోలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీది. చేసే పనిలో ఫర్ఫెక్షన్ వదిలేసి వివాదాల పాలయ్యే దారుణం ఆ నాయకత్వానిది.. పాపం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఎప్పుడు తన తప్పులు సరిదిద్దుకుంటుందో.. ఎప్పుడు వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా చూసుకుంటుందో..

Related Posts